డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ క్లాసులు: ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులు
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2020-21)కుగానూ బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్ తరగతులను డిసెంబరు 1ను నుంచి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సూచించింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆగస్టు 13న ఆల్టర్నేటివ్ అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన ఏఐసీటీఈ.. నవంబరు 1 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి, అదే రోజు నుంచి క్లాసులు మొదలుపెట్టాలని ఆదేశించగా.. ఇప్పుడా ఉత్తర్వులను సవరిస్తూ.. ఫస్ట్ ఇయర్ క్లాసుల ప్రారంభం తేదీని డిసెంబర్ 1కి పొడిగించారు.

ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటీలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సవరించిన ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 30 నాటికి ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని వివరించారు.












Click it and Unblock the Notifications