డిజిటల్ రూపంలో ఉన్న లైసెన్సు, ఆర్సీలు చెల్లుతాయి..రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం
ఇకపై డ్రైవింగ్ లైసెన్సులను, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను ఇతరత్రా డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో అంగీకరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరహా డాక్యుమెంట్లను డిజిలాకర్ లేదా మొబైల్లో చూపించినా అంగీకారం తెలపాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ఆగష్టు 9న జారీచేసింది. అంతేకాదు తప్పుడు డాక్యుమెంట్లు అయితే అవి వెంటనే ఈ చలాన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లను చూపిస్తే అది మోటార్ వెహికల్ చట్టం 1988 కిందకకు వస్తాయని కేంద్ర రోడ్లు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ రూపంలోని సర్టిఫికేట్లను ట్రాన్స్పోర్టు అధికారులు జారీ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపింది.
ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైనా వాహనాలను ఆపి డాక్యుమెంట్లు అడుగుతున్న సమయంలో ఈ-డాక్యుమెంట్లను చూపిస్తుంటే వారు అంగీకరించడం లేదని వాహనదారులు, పౌరుల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కేంద్రం ఆయారాష్ట్రాలకు ఈ నోటీసులు పంపింది. డిజిలాకర్లు, మొబైల్ పరివాహన్ యాప్స్ ప్రభుత్వం గుర్తించిన యాప్స్ కనుక వాటిలో నమోదైన ఎలక్ట్రానిక్ రికార్డ్స్ చట్టపరంగా చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. ఇవి ఐటీ చట్టం 2000కు లోబడి ఉన్నాయని వెల్లడించింది.
మోటర్ వెహికల్ చట్టం 1988, కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనలు 1989, ప్రకారం అధికారులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇతరత్ర డాక్యుమెంట్లు ఎప్పుడు చూపించమని అడిగినా అప్పుడు చూపించాలని చట్టంలో ఉంది. అంతేకాదు కొత్త వాహనాలకు సంబంధిచి బీమా సమాచారం, లేదా బీమా రెన్యువల్ సమాచారం కూడా వాహన్ డేటాబేస్పై ఉంచేందుకు ఇన్ష్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక నేరాభియోగాలు ఉన్నవారి డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వాహన్ /సారథి డేటాబేస్నుంచి ఈ చలాన్ సిస్టం ద్వారా పొందొచ్చని స్పష్టం చేసింది. పత్రాలు చేతికి అందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా పత్రాల ధృవీకరణ విచారణాధికారులకు ఎంతగానో మేలు చేస్తుందని ఇందులో వాస్తవాలు తెలుస్తాయని కేంద్రం తెలిపింది.
కేంద్ర గుర్తించిన వాహన్ /సారథి డేటాబేస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ యాప్లను రూపొందించి ఉంటే వెంటనే ఆ సమాచారం మొత్తం వాహన్/సారథి డేటాబేస్పై బదిలీ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.