హీరో నవీన్ హత్య కేసు: కోర్టులో లోంగిపోయిన నిందితులు
బెంగళూరు: కన్నడ నటుడు, నిర్మాత నవీన్ హత్య కేసులో నలుగురు నిందితులు మైసూరు జిల్లా కోర్టు ముందు లోంగిపోయారు. మైసూరు నగరంలోని విజయనగర సమీపంలోని బెళకవాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న లోకేష్, దీపు, దివాకర్, శరణ్ అనే నిందితులు న్యాయస్థానం ముందు లోంగిపోయారని విజయనగర పోలీసులు తెలిపారు.
హాయ్ కృష్ణ అనే కన్నడ సినిమాలో నవీన్ హీరోగా నటించాడు. హాయ్ కృష్ణ సినిమాకు నవీన్ నిర్మాత. మైసూరు నగరంలోని బెళకవాడి ప్రాంతంలోని మారమ్మ దేవాలయం దగ్గర నవీన్ నివాసం ఉంటున్నాడు. నవీన్ వడ్డీ వ్యాపారంతో పాటు స్థానికంగా కేబుల్ ఆపరేట్ చేస్తున్నాడు.

హాయ్ కృష్ణ సినిమా కర్ణాటక మొత్తం విడుదల అయ్యింది. సినిమా ఆశించిన విధంగా విజయం సాధించకపోవడంతో నవీన్ నష్టపోయాడు. సినిమా నిర్మాణం కొసం నవీన్ మైసూరు నగరంలో అప్పులు చేశాడు. అంతే కాకుండ అతనికి స్థానికులతో ఆర్థికలావాదేవీల కారణంగా పాతకక్షలు ఉన్నాయి.
ఈనెల 15వ తేది రాత్రి బెళకవాడిలో మారమ్మ దేవి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్బంలో నవీన్ మారమ్మ దేవి ఉత్సవాలలో పాల్గొన్నాడు. తరువాత నిందితులు అందరూ కలిసి నవీన్ను లాక్కుని వెళ్లి కళ్లలో కారం చల్లి వేటకోడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఒకరు, సోమవారం నలుగురు నిందితులు న్యాయస్థానంలో లోంగిపోయారు. నవీన్ హత్య కేసులో 12 మంది ఉన్నారు, 7గురు జైలులో ఉన్నారని ఐదు మంది తప్పించుకున్నారని విజయనగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications