ఏఏపీ ఎమ్మెల్యేపై యాసిడ్: ఢిల్లీకి జాట్ సెగ, నీటి కష్టం
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోనీ సోరీ పైన గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ లాంటి రసాయనంతో శనివారం రాత్రి దాడి చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సోనీ సోరి తన మిత్రులతో కలిసి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చారు. సోనీ సోరీ కారును అడ్డుకున్నారు. కిందకు దిగాలని బెదిరించారు.
సోనీ సోరీ కారు నుంచి బయటికి రాగానే ఆయనపై యాసిడ్ లాంటి ద్రావణాన్ని పోసి పరారయ్యారు. సహచరులు సోనీ సోరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముఖం నల్లగా మారిందని అయితే అది యాసిడ్ లాంటి ఓ రసాయన పదార్థమని వైద్యులు తేల్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హర్యానాలోని జాట్ల ఉద్యమం, ఢిల్లీపై ప్రభావం
రిజర్వేషన్లను కోరుతూ హర్యానాలో జాట్లు చేపట్టిన ఉద్యమం శనివారం కూడా పలుచోట్ల హింసకు, అల్లర్లకు కారణమైన విషయం తెలిసిందే. రోహ్తక్, ఝజ్జర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
జాట్ల మెరుపు ఆందోళనతో హర్యానా సర్కారు దిగివచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. సాక్షాత్తు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జాట్ల ఆందోళనపై స్పందించారు. మీ డిమాండ్లను నెరవేరుస్తామని, ఆందోళన విరమించాలని సీఎం ప్రకటించినా, జాట్లు ససేమిరా అంటున్నారు.
సీఎం హామీలో స్పష్టత కనిపించడం లేదని జాట్లు అంటున్నారు. తమకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఆందోళనల్లో భాగంగా జాట్లు ఢిల్లీ తాగు నీటి అవసరాలకు ప్రధానాధారంగా ఉన్న మ్యూనక్ కాల్వ గేట్లను బద్దలు కొట్టారు.
దీంతో ఢిల్లీకి జల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం గేట్లు బద్దలు కావడంతో మ్యూనక్ కాల్వ నుంచి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడం అధికార యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ ప్రజలు తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదంటున్నారు.
ఈ క్రమంలో శనివారం నాడు ఢిల్లీ జల బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పొంచి ఉన్న తాగు నీటి ఎద్దడి ముప్పు నుంచి తప్పించుకునే విషయమై చర్చించింది. హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని రోడ్లను జాట్లు దిగ్బంధించారు. దీంతో హర్యానా నుంచి ఢిల్లీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఢిల్లీ ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు ప్రధానంగా హర్యానా నుంచే సరఫరా అవుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ఢిల్లీలో నిత్యావసరాలు.. ప్రధానంగా కూరగాయలు దొరకడం లేదు. అరకొరగా దొరుకుతున్నా ధరలు మండిపోతున్నాయి.
రాబోయే ఒకటిరెండు రోజుల్లో అరవై శాతం మేర తాగునీటి సరఫరాకు కొరత ఢిల్లీలో రాబోతున్న నేపథ్యంలో... అత్యవసర ఉపశమనం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఢిల్లీ జలమండలికి ఆదేశాలు జారీ చేశారు.