చెమటలు పట్టిస్తున్న క్యాప్టెన్: పొలిటికల్ డ్రామా
చెన్నై: శాసన సభ ఎన్నికల సందర్బంగా తమిళనాడులోని అన్ని పార్టీల నాయకులకు డీఎండీకే అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తన వింత వైఖరితో అన్ని పార్టీల నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు.
తమిళనాడులో ప్రాంతీయ పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఎన్నికల సమరం జరిగేది. తరువాత స్థానంలో డీఎండీకే చేరింది. తమిళనాడులో డీఎండీకే మూడో స్థానంలో ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలదే అక్కడ పై చెయ్యి.
అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ అధికారం దక్కించుకుంటుంది. అయితే ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాలు మారిపోయాయి.
ఇప్పట్లో నిర్ణయం ఉండదు
ఇప్పట్లో తాను పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం తేల్చి చెప్పారు.
లాభం లేదు
జయలలిత నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు అన్నాడీఎంకేతో పొత్తు ఇప్పట్లో కుదిరేటట్లు లేదని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో జయ, క్యాప్టెన్
గత శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎండీకే పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎండీకే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది.
క్యాప్టెన్ మీద బీజేపీ నాయకుల ఆశ
లోక్ సభ ఎన్నికల తరువాత విజయ్ కాంత్ బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే బీజేపీ మాత్రం విజయ్ కాంత్ ను దూరం చేసుకోరాదని అనుకుంటున్నది.
దాట వేస్తున్న విజయ్ కాంత్
విజయ్ కాంత్ పొత్తుల విషయంలో ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారు. ఇటీవల బీజేపీ నాయకులు ఆయన ఇంటికి వెళ్లారు. తరువాత చూద్దాం అంటూ విజయ్ కాంత్ బీజేపీ నాయకులకు చెప్పి పంపించారు.
నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి
ఎవరితో పొత్తు పెట్టుకున్నా తానే సీఎం అభ్యర్థి అంటూ విజయ్ కాంత్ చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీ అందుకు సానుకూలంగానే ఉంది.
డీఎంకేతో బేరమాడుతున్నారు
డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇవ్వాలని విజయకాంత్ డీఎంకే నాయకులతో బేరమాడుతున్నారు.
రెబల్స్ బెడద
అధికారంలోకి రావాలని విజయ్ కాంత్ ఇతర పార్టీలకు దీటుగా ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే సొంత పార్టీలోని శాసన సభ్యులు (రెబల్స్) విజయ్ కాంత్ కు చెక్ పెడుతున్నారు.
8 మంది శాసన సభ్యులు
డీఎండీకేకి చెందిన 8 మంది శాసన సభ్యులు గత సంవత్సరం నుంచి అన్నాడీఎంకేతో కలిసి పని చేస్తున్నారు.
అన్నాడీఎంకే తీర్థం
జనవరి చివరి వారంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అదే సమయంలో డీఎండీకే రెబల్ శాసన సభ్యులు సుందరరాజన్, తమిళ్ అళగన్, అరుణ్ సుబ్రమణియన్, సురేష్ కుమార్, శాంతి, పాండియరాజన్, మైకెల్ రాయప్పన్, అరుణ్ పాండియన్ అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్నది.