ఆ స్టార్ హీరోని కొట్టి చంపారు: అసలు విషయం బయట పెట్టిన పోస్ట్మార్టమ్ చేసిన ఉద్యోగి...!!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసుపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ రెండు సంవత్సరాలుగా దర్యాప్తు సాగిస్తోన్న నేపథ్యంలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహంపై కొన్ని చోట్ల గాయాలు ఉన్నాయనే విషయం బయటపడింది. అవన్నీ కూడా ఆయనది బలవన్మరణం కాదని, హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలను రేకెత్తించాయి.
12 నెలల్లోఅయిదోసారి- అమాంతం పెరిగిన పాల ధర..!!
2020లో..
2020 జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ డెత్ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన అంకిత లోఖండె, రియా చక్రవర్తి పేర్లు బయటికొచ్చాయి. దేశం మొత్తాన్నీ కుదుపులకు గురి చేసిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా ఈ డెత్ కేసు తరువాతే వెలుగు చూసింది.
కేరీర్ లో ఉన్నత స్థితిలో..
బిహార్కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అప్పటివరకు 12 సినిమాల్లో నటించారు. ఎంఎస్ ధోనీ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. స్టార్ డమ్ను తెచ్చిపెట్టాయి. పలు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. కొన్నింటికి సంతకాలు కూడా చేశారాయన. కేరీర్ ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో అనూహ్యంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
డిప్రెషన్ తో..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద మేనేజర్గా పని చేసిన దిశ అనే యువతి ఆత్మహత్య తరువాత ఆయన డిప్రెషన్లోకి వెళ్లి ఉండొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి. బాలీవుడ్ యువ నటి అంకిత లోఖండేతో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రిలేషన్ షిప్ బ్రేకప్ కావడం కూడా దీనికి ఓ కారణంగా భావించారు అప్పట్లో. ఈ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడ్డాయి. బాలీవుడ్ లో ఉన్న లోపాలన్నీ- తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా బయటికొచ్చాయి.
అటాప్సీ స్టాఫ్ స్టేట్ మెంట్..
ఇప్పుడు తాజాగా- షాకింగ్ విషయం వెలుగు చూసింది. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని, ఆయనది హత్యేనంటూ నిర్ధారించడానికి బలమైన సాక్ష్యాధారం బయటికొచ్చింది. ఆయన మృతదేహానికి అటాప్సీ నిర్వహించిన ఉద్యోగి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ సింగ్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, అది ఎవరో కొట్టిన దెబ్బలేనంటూ ఈ ఉద్యోగి వ్యాఖ్యానించారు.
అదే రోజు అయిదు మృతదేహాలు..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహానికి కూపర్ ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ పోస్ట్ మార్టమ్ నిర్వహించిన రూప్ కుమార్ షా అనే ఉద్యోగి సంచలన విషయాలను వెల్లడించారు. సుశాంత్ సింగ్ మరణించినప్పుడు తమ ఆసుపత్రికి అయిదు మృతదేహాలు పోస్ట్మార్టం కోసం వచ్చాయని, ఆ అయిదింట్లో ఒకటి విఐపీకి చెందినదని చెప్పారు.
చూసినప్పుడే అనుమానం..
తాము పోస్ట్ మార్టమ్ చేయడానికి వెళ్లినప్పుడే అది సుశాంత్ సింగ్ మృతదేహం అని తెలిసిందని, శరీరంపై చాలా గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. మెడపై రెండు నుంచి మూడు గాయాల గుర్తులను తాము నిర్ధారించామని చెప్పారు. తాను సుశాంత్ సింగ్ మృతదేహాన్ని మొదటిసారి చూసినప్పుడే ఇది ఆత్మహత్య కాదని భావించానని ఆ ఉద్యోగి స్పష్టం చేశారు. ఆయనది హత్యేననే విషయాన్ని తనపై అధికారులకు తెలిపానని వివరించారు.
వీలైనంత త్వరగా..
నిబంధనల ప్రకారం తన పని తాను చేశానని, తాను గుర్తించిన విషయాలను వారికి వివరించానని అన్నారు. వీలైనంత త్వరగా పోస్ట్ మార్టమ్ పూర్తి చేసి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాలంటూ ఒత్తిడి చేశారని, అందుకే రాత్రి పూట మాత్రమే పోస్ట్మార్టం నిర్వహించామని రూప్ కుమార్ షా స్పష్టం చేశారు.