రానున్న ఎన్నికల్లో తమిళనాడులో మార్పులు తథ్యం: విశాల్
చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా మార్పు వస్తోందని సినీ నటుడు విశాల్ ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో ఇద్దరు అగ్ర నటులు రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించినందున ప్రజలు ఎవరికీ పట్టం కట్టనున్నారోననే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు విశాల్.
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయాలని భావించారు. అయితే విశాల్ నామినేషన్ నాటకీయ పరిణామాల్లో తిరస్కరించారు. విశాల్ నామినేషన్ తిరస్కరణ విషయమై విమర్శలు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కూడ మార్చారు.
రజనీకాంత్, కమల్హాసన్లు రాజకీయాలకు కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ.. వాళ్లు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని పేర్కొన్నారు. ఇద్దరు బరిలో ఉన్నందున ప్రజలు ఎవరికి ఓటు వేస్తారోననే విషయాన్ని చెప్పలేకపోతున్నానని అన్నారు.
అయితే రానున్న శాసన సభ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా మార్పు వస్తుందని విశాల్ అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో తన నామినేషన్ నిరాకరించిన ఘటన తనను మరింత బలవంతుడిని చేస్తోందని వివరించారు.