ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో నటుడు విశాల్ పోటీ!? తెలుగువారి ఓట్లు చీల్చడానికా? ఇది దినకరన్ వ్యూహమా?
ఒకవైపు ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ఎప్పుడు రాజకీయ పార్టీలు పెడతారని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తుండగా.. నటుడు విశాల్ ఒక అడుగు ముందుకేశారు.
చెన్నై: ఒకవైపు ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ఎప్పుడు రాజకీయ పార్టీలు పెడతారని తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తుండగా.. నటుడు విశాల్ ఒక అడుగు ముందుకేశారు.
కమల్, రజనీల కంటే ముందే విశాల్ రాజకీయ రంగ ప్రవేశం జరిగిపోనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు ఈనెల 21న జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వెలువడగా, విశాల్ పీఆర్వో కూడా వాటిని ధ్రువీకరించారు. సోమవారం ఆయన ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
ఆర్కేనగర్ లో తెలుగు ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారని, మెజారిటీ తెలుగు వారే కావడంతో అక్కడ తెలుగు మూలాలు కలిగిన వారిని విజయం వరిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థిగా తెలుగు వ్యక్తి మధుసూదన్ అక్కడ నిలబడనున్నారు.
మరోవైపు శశికళ వర్గం నుంచి దినకరన్ తానే నేరుగా బరిలో దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటుడు విశాల్ కూడా ఎన్నికల బరిలో దిగుతున్నాడని వార్తలు వెలవడడంతో ఆర్కేనగర్ ఉపఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఈ ఉపఎన్నికల్లో విశాల్ స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. జయలలిత అసలు సిసలు వారసుడు విశాల్ అని, జయలలిత సినీ రంగం నుంచి వచ్చారని, ఆమెకు అధికారిక వారసులు లేనందువల్ల విశాలే అసలు వారసుడంటూ ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
అయితే నటుడు విశాల్ను శశికళ వర్గం దినకరన్ బరిలో దించుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఆర్కేనగర్ లో తెలుగు ఓటర్లదే మెజారిటీ. దీంతో మదుసూదన్ ను విజయం వరించే అవకాశం సహజంగానే ఉంది.
ఈ విషయం గమనించిన దినకరన్ తెలుగు ఓట్లను చీల్చాలని భావిస్తున్నాడని, అలా చేయగలిగితే విజయం తనదే అవుతుందనే భావంతోనే తెలుగువారిని ఆకట్టుకోగలిగే విశాల్ను బరిలో దింపుతున్నాడని చెప్పుకుంటున్నారు.