కురువృద్ధులకు గౌరవం... పెద్దలసభకు అద్వానీ, జోషి? సుష్మాకు దక్కనున్న ఛాన్స్?
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టింది. అయితే లోక్సభ ఎన్నికల్లో పార్టీ కురువృద్ధులకు టికెట్లు ఇవ్వకపోవడంతో అప్రతిష్ట మూటగట్టుకుంది. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పక్కన బెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీజేపీ ఆ మచ్చను తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు అయిన ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను రాజ్యసభకు పంపే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ను సైతం పెద్దల సభకు పంపనున్నట్లు తెలుస్తోంది.
సీనియర్లకు దక్కని టికెట్లు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు టికెట్లు ఇవ్వలేదు. మరోవైపు అనారోగ్యం దృష్ట్యా మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ముగ్గురు పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి 75 ఏళ్లు నిండిన వారెవరికీ లోక్సభ టికెట్లు ఇవ్వవద్దని బీజేపీ 2014లోనే నిర్ణయించింది.
సీనియర్ల స్థానాల్లో మోడీ, అమిత్ షా
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ గతంలో గుజరాత్ గాంధీనగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి ఆ స్థానాన్ని అమిత్ షాకు కేటాయించారు అక్కడి నుంచి పోటీ చేసిన షా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక మురళీ మనోహర్ జోషి స్థానమైన వారణాసిని 2014లోనే ప్రధాని మోడీ కోసం త్యాగం చేశారు. అప్పట్లో కాన్పూర్ నుంచి పోటీ చేసిన జోషి 2లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ దఫా ఎన్నికల్లో ఆ స్థానాన్ని బీజేపీ సత్యదేవ్ పచౌరీకి ఇచ్చారు.
రెండు నెలల్లో 10ఖాళీలు
పెద్దల సభకు రానున్న రెండు నెలల్లో 10 స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో రెండు, బీహార్లో ఒకటి, అసోంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన స్థానంతో పాటు మరో సీటు వేకెంట్ కానున్నాయి. అటు తమిళనాడులోనూ ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే కేబినెట్లో బెర్తులు దక్కించుకున్న ఎస్ జై శంకర్, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్లను పెద్దల సభకు పంపడం తప్పనిసరి కావడంతో బీజేపీ ఆ అంశంపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
అది మా మేనిఫెస్టోలో ఉంది..కచ్చితంగా ఆ బిల్లును సభలో మళ్లీ ప్రవేశపెడతాం: రవిశంకర్ ప్రసాద్