మధ్యప్రదేశ్లో మరో దారుణం-మూక దాడిలో ఆదివాసీ వ్యక్తి మృతి-కాళ్లను తాడుతో ట్రక్కుకు కట్టేసి...
మధ్యప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ ఆదివాసీ వ్యక్తిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. ఆపై అతని రెండు కాళ్లను తాడుతో ట్రక్కు వెనుక భాగానికి కట్టేశారు. ఆ ట్రక్కు అతన్ని రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతను మృతి చెందాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్లో ఈ ఘటన జరిగింది.
మృతుడిని కన్హియ భిల్(45)గా పోలీసులు గుర్తించారు. అతన్ని దొంగ అని భావించి కొంతమంది అతనిపై దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆపై అతని కాళ్లను తాడుతో కట్టేసి... అదే తాడును ట్రక్కు వెనుకభాగానికి కట్టేశారన్నారు.ట్రక్కు రోడ్డుపై అతన్ని ఈడ్చుకెళ్లిందన్నారు. దీనిపై సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నామని... మొదట అతన్ని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.
అక్కడి నుంచి నీముచ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం ఐదుగురు తమ అదుపులోనే ఉండగా మరో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు అడిషనల్ ఎస్పీ సుందర్ సింగ్ కానేష్ తెలిపారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కన్హియ భిల్ పట్ల అంత క్రూరంగా వ్యవహరించినవారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్లో మూక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇదే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గాజులు అమ్ముకునే ఓ ముస్లిం వ్యాపారిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. గాజులు అమ్ముకునే నెపంతో అతను మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ దాడి చేశారు. బ్యాగులో నుంచి అతని వస్తువులన్నీ విసిరిపారేశారు. అతని వద్ద ఉన్న డబ్బును లాగేసుకున్నారు.
ఆ వ్యక్తులు మొదట తన పేరు అడిగి తెలుసుకున్నారని... తను ముస్లిం అని తెలియడంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. రూ.10వేలు లాగేసుకున్నారని,బ్యాంగిల్ మెటీరియల్ ధ్వంసం చేశారని పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్గర్హి ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దాడికి పాల్పడినవారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నోలోనూ జైశ్రీరామ్ అనాలని ఓ ముస్లిం వ్యక్తిని కొంతమంది వ్యక్తులు చితకబాదిన సంగతి తెలిసిందే. పోలీసుల రాకతో బాధితుడిని విడిచిపెట్టారు. బాధిత వ్యక్తి బంధువులతో పాత గొడవల నేపథ్యంలోనే అతనిపై దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే బలవంతంగా ఓ హిందూ యువతిని మత మార్పిడి చేసేందుకు యత్నించినందువల్లే అతనిపై దాడికి పాల్పడ్డామని నిందితులు చెప్పారు.ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.