గుజరాత్ ఎన్నికలు-అత్యధిక నేరచరితుల్ని నిలబెట్టిన కాంగ్రెస్ ? ఏడీఆర్ నివేదిక..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ వంటి విపక్ష పార్టీలకు కూడా ఎంతో కీలకంగా మారిపోయాయి. బీజేపీని ఎలాగైనా గద్దెదించేందుకు కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు పార్టీలు ఇప్పుడు సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ పోరులో కాంగ్రెస్ అందరి కంటే ముందుంది.
డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దఫాలుగా జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు దాదాపుగా నేరస్తులకు టికెట్లు ఇస్తుండగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ అందరి కన్నా ముందున్నట్లు తేలింది. దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఈ వివరాలను బయటపెట్టింది. గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అన్ని పార్టీలు నేరమయ రాజకీయాల్ని నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో నేరస్తులకు అన్ని పార్టీలు దాదాపుగా టికెట్లు కేటాయిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ కాస్త ముందున్నట్లు ఏడీఆర్ నివేదిక చెబుతోంది.
2004 నుంచి గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 6043 మంది పోటీ చేస్తే వీరిలో 685 మంది నేరస్తులు గెలిచారు. 2004 నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన 659 మంది అభ్యర్దుల్లో 32 శాతం అంటే 212 మంది తమకు నేరచరిత్ర ఉందని అఫిడవిట్లలోనే పేర్కొన్నారు. వీరిలో 15 శాతం మంది అంటే 106 మందిపై అతి తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అలాగే బీజేపీ నుంచి పోటీ చేసిన 684 మందిలో 24 శాతం అంటే 162 మంది నేరస్తులు ఉన్నట్లు తేలింది. గుజరాత్ కే చెందిన భారతీయ ట్రైబల్ పార్టీ అత్యధికంగా టికెట్లు ఇచ్చిన వారిలో 36 శాతం మంది నేరస్తులున్నారు. అయితే ఈ పార్టీ 2004 నుంచి ఇప్పటివరకూ కేవలం 14 మందినే నిలబెట్టింది.