Afghanistan: రంగంలో దిగిన ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్: ప్రయారిటీ అదే: అమెరికాకు ఫోన్ కాల్
న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తిన తాజా పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి స్థితిగతులను ఆరా తీస్తోంది. దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంటోంది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వం భారత్కు పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నిటి నుంచీ ఆఫ్ఘన్లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

రంగంలో దిగిన అజిత్ దోవల్..
ఈ పరిణామాల మధ్య జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతను తీసుకున్నారు. ఇందులో భాగంగా- ఓ ప్రయారిటీ లిస్ట్ను ఆయన ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొలి ప్రాధాన్యతగా ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకుని రావడం. వందలాది మంది భారతీయులు ఆఫ్ఘన్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నందున ఫస్ట్ ప్రయారిటీ కింద వారిని తరలించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
తరలింపునకు సహకరించాలంటూ..
దీనికోసం అజిత్ దోవల్.. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్కు ఫోన్ చేశారు. సుదీర్ఘంగా ఆయనతో సంభాషించారు. ప్రస్తుతం అమెరికా కూడా తమ దేశ పౌరులను తరలిస్తోంది. ఇప్పటికే రాయబార కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను తరలించింది. మిగిలిన వారిని దశలవారీగా స్వదేశానికి చేర్చుతోంది. దీనికోసం కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తమ దేశ పౌరులు, ఉద్యోగులను ఎయిర్ పోర్ట్కు తరలిస్తోంది.

అమెరికా సైన్యం ఆధీనంలో ఎయిర్ పోర్ట్..
తమ దేశానికి చెందిన ఉద్యోగులకు రక్షణ కల్పిస్తోందక్కడ. వారు ఉన్న ప్రాంతానికి ఎవరూ రానివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయంలో కాల్పులు జరపడానికి కూడా వెనుకాడట్లేదు అమెరికా సైన్యం. ఈ నేపథ్యంలో- భారత పౌరులను కూడా రక్షణ కల్పించడంతో పాటు.. వైమానిక దళానికి చెందిన విమానాల ల్యాండింగ్, టేకాఫ్పై అజిత్ దోవల్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా- సోమవారం సాయంత్రమే అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్కు ఫోన్ చేశారు.

అజిత్ దోవల్ విజ్ఞప్తికి సానుకూలంగా..
భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానాలు కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా రాకపోకలు సాగించేలా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అజిత్ దోవల్ చేసిన విజ్ఞప్తికి జేక్ సుల్లివాన్ సానుకూలంగా స్పందించారు. దీనితో భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానాలు కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి భారతీయులను స్వదేశానికి చేర్చుతున్నాయి. 46 ప్రయాణికులతో కూడిన సీ17 విమానం కాబుల్ నుంచి గత రాత్రే స్వదేశానికి చేరుకుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య భారత వైమానిక దళ విమానాలు సురక్షితంగా టేకాఫ్ తీసుకోవడానికి అమెరికా సైన్యం సహకరిస్తోంది.

మరో ఫ్లయిట్ గుజరాత్లో ల్యాండ్..
126 మంది ప్రయాణికులతో కూడిన మరో సీ 17 ఫ్లయిట్ కొద్ది సేపటి కిందటే భారత్కు చేరుకుంది. కాబుల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ ఫ్లయిట్ గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ అయింది. ఇందులో భారత రాయబార కార్యాలయం అధికారులు ఉన్నారు. మరోవంక- అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్.. భారత్కు చెందిన తన కౌంటర్ పార్ట్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం జైశంకర్ న్యూయార్క్లో ఉంటోన్నారు. ఐక్య రాజ్య సమితి భద్రత మండలిని ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సి ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చిస్తారు. తమ దేశ పౌరులను కల్లోల ఆప్ఘనిస్తాన్ నుంచి స్వదేశానికి తరలించే విషయంలో మెరుపు వేగంతో స్పందిస్తోన్న అమెరికా ప్రభుత్వాన్ని అభినందించారు.












Click it and Unblock the Notifications