
అఫ్గానిస్తాన్: ఇక్కడ అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవలేరు.. ఎందుకంటే..

"నేను చాలా ఆశలతో యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లాను. కానీ, ప్రశ్న పత్రం చూసేసరికి నాకు కావల్సిన సబ్జెక్టు కనిపించలేదు" అని 19 ఏళ్ల విద్యార్థిని కన్నీటితో చెప్పారు.
ఫాతిమా (పేరు మార్చాం) తూర్పు అఫ్గానిస్తాన్ లేహ్మాన్ ప్రావిన్సుకు చెందినవారు. తాలిబాన్లు కొత్తగా జారీ చేసిన ఆదేశాల వల్ల ఆమె కెరీర్ గురించి కన్న కలలన్నీ ప్రమాదంలో పడ్డాయి.
అఫ్గానిస్తాన్ లో ఆగస్టు 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత టీనేజీ అమ్మాయిలు చదువుకోవడానికి స్కూలుకు వెళ్లడాన్ని నిషేధించారు.
ఈ ఏడాది యూనివర్సిటీలలో చేరేందుకు కోర్సులను ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలకు తీవ్రమైన నిబంధనలు విధించారు.

ఆశలు నిరాశగా మారాయి
"నేను జర్నలిస్టు కావాలని కలలు కన్నాను. నాకు రేడియో లేదా టీవీలో పని చేయాలని ఉంది. నాకు మహిళల హక్కుల కోసం పోరాడాలని ఉంది" అని ఫాతిమా బీబీసీకి చెప్పారు.
తాలిబాన్లు అమ్మాయిలకు హై స్కూల్ చదువు నిషేధించడంతో ఆమె చదువు పూర్తి కాలేదు. ఆమె హై స్కూలులో ఆఖరి సంవత్సరంలో ఉన్నారు.
కానీ, ఆఖరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.
ఫాతిమా ఉత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు. అమ్మాయిలు ఎంపిక చేసుకునే సబ్జెక్టుల విషయంలో నిబంధనలు విధించారు.
ఉదాహరణకు నన్ గర్హర్ యూనివర్సిటీ లో 13 విభాగాలు ఉండగా, అమ్మాయిలకు కేవలం 7 సబ్జెక్టు లను మాత్రమే ఎంపిక చేసుకునే వీలు కల్పించారు.
అమ్మాయిలు జర్నలిజం, వ్యవసాయం, వెటర్నరీ మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్ధిక శాస్త్రాన్ని ఎంపిక చేసుకునేందుకు అనుమతి లేదు.
"ఈ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలనుకునే అమ్మాయిల ఆశలన్నీ కరిగిపోయాయి" అని ఫాతిమా అన్నారు. అబ్బాయిలు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రొఫెసర్లు బీబీసీకి చెప్పారు.
"ఈ ప్రవేశ పరీక్ష మోడల్ ప్రశ్న పత్రం మాకు ముందుగా ఇవ్వలేదు. ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం చూసేసరికి అందులో మాకు నచ్చిన సబ్జెక్టు కనిపించలేదు. దీంతో పది మంది అమ్మాయిలకు కన్నీరు ఆగలేదు" అని ఫాతిమా గుర్తు చేసుకున్నారు.
ఫాతిమాకు, ఆమె స్నేహితులకు ఇది చాలా కఠినమైన ప్రయాణం. స్కూళ్ళు మూసివేయడంతో యూనివర్సిటీ ప్రవేశపరీక్ష కోసం ఇంట్లోనే సిద్ధం అవ్వాల్సి వచ్చింది. ఫాతిమా తోటి విద్యార్థులతో కలిసి గ్రూపు స్టడీస్ చేసేవారు.
"మా ప్రాంతంలో ట్యూషన్ తీసుకునే అవకాశాలు లేవు. ట్యూషన్ సెంటర్లనన్నిటినీ మూసేశారు" అని చెప్పారు.
- అఫ్గానిస్తాన్: దూర ప్రయాణాలు చేసే మహిళలకు పురుషుల తోడు తప్పనిసరి చేస్తూ తాలిబాన్ల ఆదేశాలు
- ఇస్లామిక్ స్టేట్ మాజీ 'జిహాదీ పెళ్లికూతురు’ షమీమా బేగం: 'మరో అవకాశం ఇస్తే... తీవ్రవాదంపై పోరాడడంలో సాయపడతాను'

ప్రవేశ పరీక్షలు
ఈ ఏడాది ప్రవేశపరీక్ష రాసేందుకు సుమారు 100,000 మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో సుమారు 30,000 మంది అమ్మాయిలు ఉండవచ్చు. ప్రవేశ పరీక్షను అబ్బాయిలు, అమ్మాయిలు వేర్వేరు పరీక్ష హాలుల్లో రాశారు. పరీక్ష నిర్వహించేందుకు స్థలం సరిపోని చోట్ల ప్రవేశ పరీక్షను రెండు మూడు రోజుల పాటు నిర్వహించారు.
అమ్మాయిలు వైద్యం, నర్సింగ్ కోర్సులు తీసుకునేందుకు అనుమతించారు. టీచర్ ట్రైనింగ్, ఇస్లామిక్ విద్యను కూడా ఎంపిక చేసుకునే వీలుంది.
తాలిబాన్లు స్కూళ్లను అందరి కోసం తెరిచేవరకు యూనివర్సిటీ చదువు చదివే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుందని ఉద్యమకారులు అంటున్నారు.

తక్కువ డిమాండ్
అయితే, ఈ నిబంధనల గురించి తాలిబాన్ అధికారులు తక్కువగా మాట్లాడుతున్నారు. మూడు, నాలుగు సబ్జెక్టులు తప్ప మిగిలిన సబ్జెక్టులను అమ్మాయిలు ఎంపిక చేసుకోవచ్చని ఉన్నత విద్య మంత్రిత్వ శాఖలో పరీక్షల విభాగాధిపతి అబ్దుల్ ఖాదిర్ ఖాముష్ చెప్పారు.
"అమ్మాయిలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో, అమ్మాయిలను కొన్ని కోర్సులను ఎంపిక చేసేందుకు అనుమతించడం లేదు" అని చెప్పారు.
ఈ ఏడాది కోర్సులను ఆఫర్ చేయనున్న యూనివర్సిటీల గురించి అధికారులు వెల్లడించాల్సి ఉంది.
అఫ్గానిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింది. దేశం నుంచి అమెరికన్ సేనలు వైదొలిగిన తర్వాత శిక్షణ పొందిన విద్యావేత్తలు కూడా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ఇతర దేశాలు అందించే సహాయం పైనే ఆధారపడుతోంది.
కానీ, తాలిబాన్లు అమ్మాయిలను స్కూలుకు వెళ్లడాన్ని నిషేదించిన తర్వాత చాలా సహాయక సంస్థలు విద్యా రంగానికి అందించే సహాయాన్ని పూర్తిగా నిలిపేశాయి. చాలా మంది టీచర్లకు చాలా కాలంగా జీతాలు అందడం లేదు.

"నాకు మరో మార్గం లేదు"
కోర్సుల విషయంలో నిషేధం దేశవ్యాప్తంగా ఒకే విధంగా లేదని బీబీసీ గమనించింది.
ఉదాహరణకు కాబుల్ యూనివర్సిటీలో అమ్మాయిలు జర్నలిజం చదివేందుకు అనుమతి లభిస్తోంది. కానీ, ఫాతిమా తాలిబాన్ నిబంధనలను ఉల్లంఘించి కాబుల్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోలేరు.
అమ్మాయిలు తమ సొంత ప్రావిన్సు అవతల ఉన్న యూనివర్సిటీలలో దరఖాస్తు చేసుకునేందుకు తాలిబాన్లు అనుమతించరు.
"వాళ్ళిచ్చిన కోర్సు మాత్రమే నేను చదువుకోవాలి. నాకు వేరే మార్గం లేదు" అని ఫాతిమా చెప్పారు. కానీ, ఆమె ఆశను వదులుకోలేదు.
"ప్రభుత్వం వచ్చే ఏడాది తమ విధానాన్ని మార్చితే, నేను జర్నలిజం ఎంపిక చేసుకుంటాను" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- తెలంగాణ: 'చూపు పోయింది.. వరంగల్లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అస్సాం: ఆ కుటుంబంలో మూడు తరాలుగా అందరూ అంధులే... ఎందుకిలా?
- డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)