రాహుల్ 9 ఏళ్ల నాటి డిమాండ్ ను నెరవేర్చిన మోడీ..! పాత ట్వీట్ల వైరల్..!
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధింపు విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా గత కొన్నేళ్లుగా ముందుకెళ్లిన ప్రధాని మోడీ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా నాలుగుగా ఉన్న జీఎస్టీ స్లాబుల్ని రెండుకు తగ్గించేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వ్యాపారులు, వినియోగదారులు ఇప్పుడు తాము అమ్మే, కొనే వస్తువులు ఏయే స్లాబుల్లోకి మారాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మోడీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక కనిపిస్తున్న ప్రత్యక్ష కారణంతో పాటు ఓ పాత డిమాండ్ కూడా కనిపిస్తోంది.
2016లో దేశవ్యాప్తంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అధికారికంగా జీఎస్టీ అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా నాలుగు రకాల స్లాబ్ లను తీసుకొచ్చారు. క్రమంగా ఈ స్లాబ్ ల పరిధిలోకి దేశంలోని ప్రతీ వస్తువునూ చేర్చడం ప్రారంభించారు. అంతే కాదు ప్రతీ వస్తువునూ విభజించి మరీ పన్నుల బాదుడు బాదేశారు. దీంతో సామాన్యుడు లబోదిబోమన్నాడు. ఈ సమయంలో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గరిష్ట జీఎస్టీ స్లాబ్ ను 18 శాతానికే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో అందరికీ ప్రయోజనకరంగా ఉండాలంటే జీఎస్టీ గరిష్ట స్లాబ్ రేట్ 18 శాతం ఉండాలని 2016 అక్టోబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ తొలి భేటీ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేశారు. 2005 నుంచీ కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ అనేది పరిశ్రమకు అనుకూలంగా, వాణిజ్యానికి అనుకూలంగా, ముఖ్యంగా ద్రవ్యోల్బణ భారం పేదలపై పడకుండా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పరోక్ష పన్నుగా జీఎస్టీ పేదలు, ధనికులపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందన్నారు.

కాబట్టి 18 శాతానికి లేదా అంతకంటే తక్కువకు జీఎస్టీని ఉంచడం ద్వారా పేదలపై ఆ భారం పడకుండా చూడాలని రాహుల్ గాంధీ జీఎస్టీ కౌన్సిల్ ను కోరారు. అయితే అప్పట్లో జీఎస్టీ కౌన్సిల్ రాహుల్ వాదనను పట్టించుకోలేదు. ఆ తర్వాత రాహుల్ కూడా ఆ విషయం పలుమార్లు ప్రస్తావించి వదిలేశారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత కారణంగా దేశంలో వినియోగాన్ని పెంచుకోవడం కోసం ప్రధాని మోడీ ఇలా జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి వాటికి దీపావళి కానుక అని చెబుతుండటం విశేషం.












Click it and Unblock the Notifications