మూడేళ్ల తర్వాత హజారేతో వేదికను పంచుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారేతో ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడిపోయి దాదాపు మూడేళ్ల అవుతోంది. మూడేళ్ల తర్వాత కేజ్రీవాల్ మంగళవారంనాడు హజారేతో వేదికను పంచుకున్నారు. భూసేకరణ అర్డినెన్స్కు వ్యతిరేకంగా హజారే చేపట్టిన గాంధేయ ఉద్యమానికి కేజ్రీవాల్ మద్దతు పలికారు.
హజారే కేజ్రీవాల్ను వేదిక మీదికి ఆహ్వానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు దాదాపు అందరూ ఆందోళనలో హజారేతో కలిశారు. కేజ్రీవాల్ క్లుప్తంగా మాట్లాడారు. కేంద్రం తెస్తున్న వివాదాస్పదమైన చట్టంపై విరుచుకుపడ్డారు. లోకసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని చేజిక్కించుకున్న బిజెపిని దాని పేదల వ్యతిరేక విధానాల వల్ల ఢిల్లీ ప్రజలు శిక్షించారని ఆయన అన్నారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజల నుంచి గుణపాఠం తీసుకోవాలని ఆయన అన్నారు.

మేలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు ఘన విజయాన్ని అందించారని, కానీ 8,9 నెలల్లోనే దాని విధానాల వల్ల బిజెపిని పెకిలించారని ఆయన అన్నారు. పేదలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టాలు చేస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. అన్నా హజారే నాయకత్వంలోని దేశవ్యాప్త ఆందోళనకు తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ నగరంలో బలవంతంగా ఎవరు కూడా భూములు తీసుకోబోరని ముఖ్యమంత్రిగా తాను ప్రకటిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
కేజ్రీవాల్తో పాటు పలువురు రాజకీయ నాయకులు అన్నా హజారేకు మద్దతు ఇచ్చారు. సిపిఐకి చెందిన అతుల్ అంజన్, ఎండిఎంకెకు చెందిన వైగో అన్నా హజారేకు మద్దతుగా వేదికపై కూర్చున్నారు. అన్నా హజారే తన గురువు అని, తన తండ్రిలాంటివారని, గాంధేయవాద ఉద్యమాన్ని హృదయపూర్వకంగా తాను బలపరుస్తానని కేజ్రీవాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications