కంగనను ఆడేసుకుంటున్న ప్రత్యర్దులు-పద్మశ్రీ వెనక్కిచ్చేందుకు సిద్ధమని ప్రకటన
భారతదేశానికి 1947లో స్వాతంత్రం రాలేదని 2014లో కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక వచ్చిందని,1947లో వచ్చిన స్వాతంత్ర్యం బ్రిటీషర్లు పెట్టిన భిక్ష అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం సాగుతోంది. 2014 వరకూ భారత్ లో సాగిన పాలన కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన బ్రిటీషర్ల పాలన అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తాజాగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనపై ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నారు. దీంతో ఇవాళ ఆమె దీనిపై స్పందించారు.
తన వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో దుమారం రేగుతున్న నేపథ్యంలో కంగన ఇవాళ దీనిపై స్పందించారు. ఎప్పటిలాగే ఇన్ స్టా గ్రామ్ లోని తన ఖాతాలో దీనిపై అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశ స్వాతంత్ర్యంపై తన వివాదాస్పద ప్రకటనల గురించి తన ఆలోచనలను ఇవాళ కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. తన ఇంటర్వ్యూలో అమరవీరులను, స్వాతంత్య్ర సమరయోధులను ఎవరైనా అగౌరవపరిచినట్లు నిరూపిస్తే తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని కంగనా చెప్పారు.
దేశంలో ప్రజా సేవలో గడిపుతున్న పలువురికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈసారి కంగనకు కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా కంగన ఈ అవార్డును తీసుకున్నారు. ఆ తర్వాత భారత స్వాతంత్రంపై ఓ టీవీ షోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగన పద్మశ్రీ అవార్డు తీసుకుని మరీ భారత స్వాతంత్రాన్ని వీరుల త్యాగాల్ని అవమానిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర సమరయోధుల్ని అవమానించిన కంగన పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను వీరుల్ని అవమానించినట్లు నిరూపిస్తే అవార్డు వెనక్కిస్తానని కంగన ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలో కంగన రనౌత్ కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డుపైనా చర్చ జరుగుతోంది. అదే బాలీవుడ్ కు చెందిన సామాజిక కార్యకర్త, నటుడు సోనూసూద్ కరోనాలో సైతం లక్షలాది మందికి సేవ చేయగా..ఆయన్ను కాదని కేంద్రానికి అనుకూలంగా ఉన్నారనే కారణంతో పద్మశ్రీని కంగనకు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. సోనూసూద్ తో కంగనను పోలుస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.