'మొన్న బీహార్.. నిన్న కర్ణాటక.. రేపు?': తిరగబడ్డ బీజేపీ వ్యూహం?..
న్యూఢిల్లీ: బుధవారం అర్థరాత్రి హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు బీజేపీకే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. గురువారం ఉదయం యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ నిర్ణయం అనైతికమంటూ సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్, జేడీఎస్ లకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగలింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కొన్ని మౌళికమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అతిపెద్ద పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరైనదా?.. లేక మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంకీర్ణ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సరైనదా? అన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. న్యాయవాదులు సైతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం మాత్రం గవర్నర్ అధికారాల్లో తలదూర్చేది లేదని స్పష్టంగా చెప్పింది.
ఈ నేపథ్యంలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని అదే వ్యూహంతో తిప్పికొట్టాలని ప్రత్యర్థి పార్టీలు ప్రణాళికలు రచిస్తుండటం గమనార్హం. ఇంతకీ ఏంటా ప్లాన్?
అలా అయితే గోవాలో మాకే అవకాశం ఇవ్వాలి: కాంగ్రెస్
కర్ణాటకలో గవర్నర్ వజుభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానినంచడంతో కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాయి. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో గతంలో గోవా ఎన్నికల్లో జరిగిన పరిణామాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ లెక్కన.. గత గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది తామే కాబట్టి ఇప్పుడు గోవా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతామంటోంది కాంగ్రెస్.
అదే బాటలో ఆర్జేడీ కూడా:
గోవా గవర్నర్ మృదుల సిన్హాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతామని కాంగ్రెస్ ప్రకటించడంతో.. ఆ వెంటనే ఆర్జేడీ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చంది. ఆర్జేడీ నేతే తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. అలా అయితే బీహార్ లోనూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుత ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోవా-బీహార్..:
గోవా 2017అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40సీట్లకు గాను కాంగ్రెస్ 21సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత స్వతంత్రులు, మరో రెండు చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ.. తమకే మెజారిటీ ఉందని చెబుతూ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ వారికే అవకాశం ఇవ్వడం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.ఇక అటు బీహార్ లోనూ అదే పరిస్థితి. 2015లొ జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243స్థానాలకు గాను ఆర్జేడీ 80స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జేడీయూ, బీజేపీ జతకట్టడంతో ఆర్జేడీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.
రేపు ఆర్జేడీ ధర్నా..:
కర్ణాటకలో ఏదైతే జరిగిందో గోవాలోనూ అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 17మంది ఎమ్మెల్యేలతో గోవా రాజ్ భవన్ ముందు పరేడ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఇన్ చార్జి చెల్ల కుమార్ ప్రకటించారు.
ఆ వెంటనే ఆర్జేడీ తాము కూడా ఆందోళన బాట పడుతున్నట్టు తెలిపింది. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినందుకు రేపు ఒక్కరోజు ధర్నా చేస్తున్నట్టు తేజస్వియాదవ్ ప్రకటించారు. అదే సమయంలో కర్ణాటకలో జరిగినట్టే బీహార్ లో అతిపెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు.
మొన్న బీహార్.. నిన్న కర్ణాటక.. రేపు:
శుక్రవారం మధ్యాహ్నాం ఒంటిగంటకు గవర్నర్ ను కలవబోతున్నట్టు తేజస్వి తెలిపారు. ఇక కర్ణాటక రాజకీయం గురించి ప్రస్తావిస్తూ.. 'బీజేపీ తమ మెజారిటీని ఎలా నిరూపించుకుంటుంది?. అమిత్ షా దగ్గరే ఒకే ఫార్ములా ఉంది.
ఒకటి ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనడం లేదా వాళ్లపై సీబీఐ, ఈడీల చేత కేసుల బనాయించడం. ఇదే బీజేపీ కొనసాగిస్తున్న నియంత్రుత్వం' అని తేజస్వి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు గనుక వ్యతిరేకించకపోతే.. మొన్న బీహార్, నిన్న కర్ణాటక, రేప్పొద్దున మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే చేస్తుందని ఆయన అన్నారు.