పెరుగన్నం తిన్న జయ.. నిద్రలేమితో బాధపడిందట
న్యూఢిల్లీ: నిన్నటి దాకా ముఖ్యమంత్రి హోదాలో రాజభోగాలు అనుభవించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత శనివారం రాత్రి బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో సాధారణ ఖైదీల మాదిరే సాదాసీదా భోజనం చేయాల్సి వచ్చింది. శనివారం సాయంత్రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయలలితకు శిక్ష ఖరారు చేయగానే పోలీసులు ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. రాత్రి కాగానే జైలులోని ఖైదీలకు అందించే భోజనాన్ని ఆమెకు కూడా అందజేశారు. ఈ భోజనంలో రాగిముద్ద, సాంబారుతో పాటు పెరుగన్నం కూడా ఉందని జైలు సిబ్బంది వెల్లడించారు. పెరుగన్నాన్ని ఆవకాయ పచ్చడితో కలుపుకుని జయలలిత ఆరగించారని సమాచారం.
జైలులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శనివారం రాత్రి సరిగా నిద్ర కూడా పోలేదట. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితను పోలీసులు శనివారం సాయంత్రం జైలుకు తరలించారు. జైలులోని 23వ నెంబరు గదిలో ఒంటరిగానే జయలలిత రాత్రంతా గడిపినట్లు సమాచారం. తీర్పు వెలువడగానే అస్వస్థతకు గురైన జయలలితను తొలుత ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు అనంతరం ఆమెను జైలుకు తరలించారు. జైలు గదిలో ఒంటరిగా ఉన్న జయలలిత, రాత్రి నిద్రలేమితో బాధపడినట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు.

ఇక పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఈ ఉదయం ఉదయం తమిళనాడు రాష్ట్ర మంత్రులు కలిశారు. ముగ్గురు మంత్రులు, జయ వ్యక్తిగత కార్యదర్శి ఆమెను కలిసి అల్పాహారం, తమిళ దినపత్రికలు అందించారు. కాగా, మంత్రులు తమతోపాటు జయలలిత వ్యక్తిగత కుర్చీని తీసుకురాగా, జైలు అధికారులు దాన్ని లోపలికి తీసుకువెళ్ళేందుకు అంగీకరించలేదు. సాధారణంగా జయలలిత ఎక్కడ పర్యటన వెళ్లినా, ఆమె సిబ్బంది ఈ కుర్చీని కూడా తీసుకు వెళుతుంటారు.












Click it and Unblock the Notifications