ఎన్నికలు ముగిశాయి... భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?
కొత్త ప్రభుత్వం ఇంకా అధికారం స్వీకరించకముందే ఇంధనం ధరలు పెరిగిపోయాయి. గత ఆరు రోజులుగా ఇంధనం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెట్రోలు పై 0.50 పైసలు పెట్రోలు పై పెరుగగా రూ.1.04 పైసలు డీజిల్పై పెరిగింది. గత నెలలో మాత్రం పెట్రోలు ధరలు పెద్దగా పెరగలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ భారత్లో మాత్రం పెట్రోలు ధరలు పెరగలేదు. గత నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశమున్నందున పెట్రోలు ధరల పెంచకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 19 తర్వాత అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత క్రమంగా పెట్రోలు ధరలు పెరుగుతూ వచ్చాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై నగరాల్లో వరుసగా రూ. 71.86, రూ.73.92, రూ.77.47 రూ.74.59గా ఉన్నాయి. అదే డీజిల్ ధరలు వరుసగా రూ. 66.69, రూ.68.45, రూ. 69.88, రూ.70.50గా ఉన్నాయి. అయితే ఎన్నికల సందర్భంగా పెట్రోలు డీజిల్ ధరలను నియంత్రణలో ఉండేలా చూడాలని ఆయిల్ సంస్థలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అయితే ఇంధనం ధరల్లో వరుస పెరుగుదలకు కారణం గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్ లో మాత్రం ధరలు పెరగలేదని ఆయిల్ సంస్థలు చెబుతున్నాయి.
ఇక గతేడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా దాదాపు 19 రోజులు పెట్రోలు ధరలు పెరగలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 14 రోజుల పాటు పెట్రోలు ధరల్లో పెరేుగుదల కనిపించలేదు. ఇక దేశంలో దాదాపు 90 శాతం పెట్రోలు ఔట్లెట్లను ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఒక 10శాతం ఔట్లెట్లను మాత్రమే ఇతర ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి.