జయంత్ చౌదరి రుణం తీర్చుకున్న అఖిలేష్-రాజ్యసభకు ఎస్పీ మిత్రపక్ష నేత-భార్యను కాదని
యూపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చి విఫలమైన సమాజ్ వాదీ పార్టీ తమ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సాయంతో రాజ్యసభకు ఎంపీల్ని పంపుతోంది. ఇదే క్రమంలో బీజేపీకి ఎస్పీ పోటీ ఇవ్వడంలో సహకరించిన రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరిని రాజ్యసభకు పంపాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు.
రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ముగ్గురు ఎంపీల్ని గెలిపించుకునే ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో ఈ మూడు సీట్లలో ఒకదాన్ని మిత్రపక్షం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరికి కేటాయిస్తూ అఖిలేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంపీ పదవిని వదులుకుని ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్న అఖిలేష్ యాదవ్.. తమ మిత్రపక్షమైన ఆర్ఎల్టీ నేత జయంత్ ను రాజ్యసభకు పంపుతుండం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ ను రాజ్యసభకు పంపాలని భావించారు. కానీ బీజేపీ ఇప్పటికే చేస్తున్న వారసత్వ రాజకీయాల విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావించడం వల్లే జయంత్ చౌదరికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పోరాడుతున్న ఎస్పీకి ఆర్ఎల్టీ అధినేత జయంత్ చౌదరి అండగా నిలిచారు. బీజేపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఎస్పీతో మితృత్యాన్ని వీడలేదు. దీంతో అఖిలేష్ కు జయంత్ నమ్మకమైన మిత్రుడిగా మారిపోయారు.
ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కు మద్దతివ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కపిల్ సిబల్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జయంత్ చౌదరిని ఎంపిక చేయడంతో ఆయన కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే మూడో అభ్యర్ధిగా పార్టీ మైనార్టీ నేత జావెద్ అలీని అఖిలేష్ రాజ్యసభకు పంపుతున్నారు.