ఈసారి చైనా ముప్పు అరుణాచల్ ప్రదేశ్ నుంచే-డ్రాగన్ కు అడ్డుకట్టకు భారత్ దీటైన ప్లాన్
భారత్-చైనా మధ్య గతేడాది తూర్పులడఖ్ లో ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినా అవి పూర్తి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అక్కడక్కడా బలగాల ఉపసంహరణలు మినహా మరే పురోగతి లేదు. అలాంటి సమయంలో చైనా ఫోకస్ అకస్మాత్తుగా టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ పై మళ్లింది ఇఫ్పటికే అరుణాచల్ ప్రదేశ్ ను తమ మ్యాప్ లో చూపించుకుంటున్న చైనా.. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతలకు తెరలేపుతోంది.
Recommended Video
భారత్-చైనా ఉద్రిక్తతలు
భారత్-చైనా మధ్య గతేడాది తూర్పు లడఖ్, ప్యాంగ్ యాంగ్ సరస్సుల సమీపంలో ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గల్వాన్ ఘర్షణల్లో భారత్, చైనా ఇరుదేశాలూ భారీగా తమ సైనికుల్ని కోల్పోయాయి. అయినా పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.
తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ను ఇబ్బందిపెట్టేలా చైనా మరిన్ని మోహరింపులు చేస్తోంది. దీంతో భారత్ కూడా దీటుగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. చైనాకు పోటీగా భారత్ కూడా మళ్లీ బలగాల మోహరింపులు పెంచుతోంది. అలాగే అత్యాధునిక ఆయుధ వ్యవస్ధలను దింపుతోంది. దీంతో మరోసారి భారత్-చైనా పోరు ముదురుతోంది.
అరుణాచల్ లోనూ చైనా పోరు
ఓవైపు తూర్పు లడఖ్ లో భారత బలగాలను చికాకుపెడుతున్న చైనా.. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ పైనా ఫోకస్ పెంచుతోంది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ ను తమ మ్యాప్ లో భాగంగా చూపించుకున్న చైనా.. ఇప్పుడు అక్కడ చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఓసారి అరుణాచల్ లో చైనా బలగాలు చొరబాటు ప్రయత్నం చేయగా.. భారత్ దీటుగా బదులిచ్చింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో ఎలాగైనా చొరబడేందుకు చైనా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఆ రాష్ట్రంలో చొరబాట్లకు తెరదీయడం ద్వారా భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి వీలైనంత ఎక్కువ భూభాగం తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. భారత్ కు అక్కడి నుంచే అడ్డుకట్ట వేసేందుకు వ్యూహరచన చేస్తోంది.
దీటుగా బదులిస్తున్న భారత్
అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాట్లకు చైనా సైన్యం చేస్తున్న ప్రయత్నాలకు భారత సైన్యం కూడా దీటుగా బదులిస్తోంది. తాజాగా అరుణాచల్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా భారత్ అవేవీ పట్టించుకోకుండా వెంకయ్య పర్యటన కొనసాగించింది. అంతే కాదు అరుణాచల్ లో వేలు పెడితే ఊరుకునేది లేదని గట్టి హెచ్చరికలు పంపింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాట్లకు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్దోంది. ఇప్పటికే పలుమార్లు భారత బలగాలు చైనా సైన్యాన్ని చొరబడకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో భారత్-చైనా వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
అరుణాచల్ లో చైనాను అడ్డుకునే ప్లాన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సైన్యం చొరబాట్లకు చేస్తున్న ప్రయత్నాలు, మన దేశ భూభాగంలో ఉన్న రాష్ట్రంపై అనధికారికంగా పెత్తనం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్ధంగా అడ్డుకుంటోంది. అదే సమయంలో ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను భారీగా అభివృద్ధి చేయడం ద్వారా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అలాగే అధునాత నిఘా సాధనాలను కూడా రంగంలోకి దింపుతోంది. తద్వారా రెండంచెల వ్యూహానికి భారత్ పదును పెడుతున్నట్లు అధికారులు వివరించారు. తాజా చర్యలతో చైనా బలగాలు మెరుపుదాడి చేయకుండా అడ్డుకోవడమే తమ వ్యూహమని అధికారులు చెప్తున్నారు.