ఏంటీ వింత-కోవిడ్ వ్యాక్సిన్తో అయస్కాంత శక్తి-శరీరానికి అతుక్కుంటున్న ఇనుప వస్తువులు
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుంటోందని జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్న నాసిక్లో,నిన్న ఉల్హాసన్ నగర్లో,ఇవాళ(జూన్ 14) జార్ఖండ్లో ఈ తరహా కేసులు వెలుగులోకి వచ్చాయి. జార్ఖండ్లోని హజారీబాగ్కి చెందిన తహీర్ అన్సారీ అనే వ్యక్తి... కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుందని చెబుతున్నారు. ఇనుప వస్తువులు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని ఆయన అంటున్నారు.
తహీర్ అన్సారీ మాట్లాడుతూ... శనివారం(జూన్ 12) నాడు తాను కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోసు వేయించుకున్నానని తెలిపారు. నాసిక్కి చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తి వ్యాక్సినేషన్ తర్వాత అతని శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుందని చెబుతూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోను తాను చూశానన్నారు. తాను కూడా ఒకసారి ప్రయత్నిద్దామని... స్పూన్లు,ఫోర్క్స్,కాయిన్స్ ఇతరత్రా ఇనుప వస్తువులను శరీరంపై పెట్టగా అవి అతుక్కుపోయాయని చెప్పారు.
తహీర్ అన్సారీ గురించి తెలుసుకుని స్థానిక వైద్యారోగ శాఖ అధికారులు అతని ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ఎస్కే వేద్ రాజన్ మాట్లాడుతూ... అన్సారీ శరీరంలో ఎటువంటి అయస్కాంత శక్తి లేదన్నారు. అయితే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో 48 గంటలు అతన్ని ఇంటి వద్దే ఉండమని చెప్పామన్నారు.
రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన అరవింద్ జగన్నాథ్ సోనార్ అనే వ్యక్తి కూడా తన శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుందని చెప్పాడు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాతే ఈ వింత లక్షణం కనిపిస్తోందన్నారు. శరీరానికి స్పూన్లు,గిన్నెలు అతికిన వీడియోను అరవింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదే మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాసన్ నగర్కి చెందిన 46 ఏళ్ల శాంతం చౌదరి అనే వ్యక్తి కూడా... వ్యాక్సినేషన్ తర్వాత తన శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుందని చెప్పాడు. శరీరంపై ఇనుప వస్తువులు అతికిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నాసిక్కి చెందిన అరవింద్ జగన్నాథ్ గురించి తెలిశాక తాను కూడా టెస్ట్ చేశానని... తన శరీరానికి కూడా ఇనుప వస్తువులు అతుక్కుపోతున్నాయని చెప్పారు.
మరోవైపు కేంద్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. వ్యాక్సిన్తో శరీరం అయస్కాంత శక్తిని సంతరించుకుంటోందన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని,అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.వ్యాక్సిన్లలో లోహ ఆధారిత పదార్థాలు ఏమీ లేవని... వ్యాక్సిన్ తర్వాత స్వల్ప తలనొప్పి,జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని వెల్లడించింది.