కేంద్రానికి అంతుబట్టని కశ్మీర్ యాపిల్ -వ్యూహాలన్నీ చిత్తు-మరిన్ని ప్లాన్లకు పదును
భారత్ ను ఏలడం ఓ ఎత్తు, కశ్మీర్ ను ఏలాలనుకోవడం మరో ఎత్తని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఉగ్రవాదాన్ని అరికట్టే నెపంతో కశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసి దశాబ్దాల క్రితం లభించిన స్వయం ప్రతిప్రత్తికి తూట్లు పొడిచిన కేంద్రం.. అక్కడి రాజకీయ నేతలందరినీ జైళ్లకు పంపింది. వ్యతిరేకతను లెక్కచేయకుండా తమ వ్యూహం ఫలిస్తుందని భావించిన కేంద్రానికి ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. దీంతో మరో కొత్త వ్యూహం రచించి ఇందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.
కశ్మీర్ లో కేంద్రం చర్యలు
విభిన్న ప్రత్యేకతలు కలిగిన జమ్మూ కశ్మీర్ భారత్ లోని ఓ ప్రాంతం మాత్రమే కాదు. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. ఇక్కడ ఏ చిన్న చర్య జరిగినా దాని ప్రతిచర్య చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రత్యేక రాష్ట్రం కశ్మీర్ లో కేంద్రం రెండేళ్ల క్రితం దూకుడు దర్యలకు దిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు చేపట్టిన చర్యలకు భిన్నంగా ఈ చర్యలు ఉండటంతో అవి కాస్తా వివాదాస్పదం కావడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, ఆర్టికల్ 35ఏ రద్దుతో కశ్మీర్ రెక్కలు విరిచేసి అక్కడ పాగా వేద్దామనుకున్న వారిని కట్టడి చేశామని సంబరపడిన కేంద్రానికి ఆ సంతోషం ఎంతోకాలం మిగల్లేదు. రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడం మినహా ఇప్పుడు కశ్మీర్లో ఏ సంతోషం కూడా లేకుండాపోయింది.
దూకుడు చర్యలతో రాజకీయ వ్యతిరేకత
కశ్మీర్లో అక్కడి రాజకీయ నేతలు, ప్రజలతో సంబంధం లేకుండా కేంద్రం తీసుకున్న దూకుడు చర్యలు స్ధానికుల్లో ఆగ్రహం నింపాయి. సొంత భూభాగంలో ఉన్న నేతల్ని, ప్రజల్ని నియంత్రించలేక వారిపై చట్టాల్ని ప్రయోగించడం మొదలుపెట్టిన కేంద్రానికి అతి సత్ఫలితాలు ఇవ్వడం లేదనే విషయం త్వరగానే అర్ధం కావడం మొదలైంది. ముఖ్యంగా రాజకీయ నేతల్ని గృహనిర్బంధంలో ఉంచడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో వారందరినీ విడిచిపెట్టాల్సి వచ్చింది. వీరితో పాటు స్ధానికుల్ని అరెస్టులు చేసుకుంటూ వెళ్లడంపైనా పలు కేసులు నడుస్తున్నాయి. వీటిపై నిత్యం కేంద్రం కోర్టుల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది.
పౌరుల హత్యలతో పండిట్ల రీ ఎంట్రీకి చెక్
కశ్మీర్లో ఒకప్పుడు భారీగా కనిపించిన పండిట్లు ఆ తర్వాత ఉగ్రవాద దాడులకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. వారందరినీ తిరిగి కశ్మీర్లోని స్వస్ధలాలకు రప్పించేందుకు కేంద్రం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వారిని తిరిగి రప్పించేందుకు కేంద్రం ఎన్నో హామీలు ఇస్తోంది. అయితే వారి ప్రాణాలకు మాత్రం హామీ ఇవ్వలేకపోతోంది. కశ్మీర్లో పండిట్ల రీ ఎంట్రీ కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఉగ్రవాదులు పౌరుల్ని హత్యలు చేస్తున్నారు. దీంతో పండిట్ల రాక సంగతి అటుంచి ముందు పౌరుల ప్రాణాల్ని కాపాడటం కేంద్రానికి సవాలుగా మారిపోయింది.
వెంటాడుతున్న తాలిబన్ల భయం
ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తర్వాత తాలిబన్లు.. ప్రపంచంలోని ఒకప్పటి ముస్లిం భూభాగాలు, ఇప్పుడు ముస్లిమేతరుల చేతుల్లో ఉన్న భూభాగాలపై దృష్టిపెట్టారన్న వార్తలు భారత్ ను కలవరపెడుతున్నాయి. ఇదే క్రమంలో కశ్మీర్ నూ స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో కేంద్రం అప్రమత్తమవుతోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండటం, సరిహద్దు ప్రాంతం కావడం, శీతాకాలంలో మారే పరిస్ధితులు ఇలా ఎటు చూసినా ఈ వ్యవహారం భారత్ కు సవాల్ విసురుతోంది. దీంతో ఇప్పుడు కశ్మీర్లోకి తాలిబన్లు చొరబడకుండా చూసుకోవడం భారత్ కు తప్పనిసరిగా మారిపోయింది.
కొత్త వ్యూహాలకు పదును
కశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన, ఎన్నికలు, పండిట్ల రీ ఎంట్రీ ప్రయత్నాలు ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా స్ధానికుల్లో మాత్రం విశ్వాసం నింపడంలో కేంద్రం విపలమైంది. దీంతో తాజాగా చోటు చేసుకుంటున్న పౌరుల హత్యలు, తాలిబన్ల హెచ్చరికలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి. దీంతో కశ్మీర్ పై పట్టు సాధించేందుకు కేంద్రం మరిన్ని కొత్త వ్యూహాలు అనుసరించక తప్పని పరిస్ధితి వచ్చేసింది. తాజాగా మూడు రోజుల పాటు కశ్మీర్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే అంశంపై స్ధానిక అధికారులతో చర్చించారు. అయినా ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం మాత్రం లభించలేదు. దీంతో మరిన్ని దఫాలుగా చర్చలు జరిపేందుకు, ఇందులో స్ధానికులకు ప్రాతినిధ్యం కల్పీంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.