దక్షిణాది దెబ్బకు దిగొచ్చిన కేంద్రం ! ఎంబీబీఎస్ సీట్ల పరిమితిపై యూటర్న్...
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యపై పరిమితులు విధిస్తూ కేంద్రం గతంలో తీసుకున్న నిర్ణయం దక్షిణాదిలో చిచ్చు రేపింది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణం చూపుతూ అన్ని రాష్ట్రాలపై విధించిన పరిమితిని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దక్షిణాదిలో వైద్య సదుపాయాల్ని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా మండిపడ్డాయి. ఈ నేపథ్యంల కేంద్రం వెనక్కి తగ్గింది.
మూడు నెలల క్రితం ప్రతీ రాష్ట్రంలోనూ 10 లక్షల జనాభాకు 100 మెడికల్ సీట్లు మాత్రమే ఉండాలంటూ జాతీయ మెడికల్ కమిషన్ ఆంక్షలు విధించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంతకు మించి మెడికల్ సీట్లు ఉన్నందున ఇకపై మెడికల్ కాలేజీలకు, సీట్ల పెంపుకు అనుమతులు ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడ్డాయి. ఉత్తరాదిలో వెనుకబాటు తనాన్ని కవర్ చేసుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ తమ అభ్యంతరాల్ని తెలిపాయి.

ఆగస్టు 16న నోటిఫై చేసిన ఈ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో జాతీయ మెడికల్ కమిషన్ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో ఇందులో భాగస్వాములైన అందరితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని మెడికల్ కమిషన్ వెల్లడించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల పంతం నెగ్గినట్లయింది.
మరోవైపు ఇప్పటికే ఉత్తరాది పెత్తనం కొనసాగుతోందని, దీంతో తమకు ప్రతీ విషయంలోనూ అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. దీంతో కేంద్రం ప్రకటించే భారతరత్న, ఇతర అవార్డుల్లోనూ దక్షిణాదికి ప్రాధాన్యం కల్పించారు. మెడికల్ సీట్ల విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇబ్బందులు ఎందుకని కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications