రిసార్ట్ వద్ద హైడ్రామా: 'శశికళ చాలా ధైర్యంగా ఉన్నారు'
గోల్డెన్ బే రిసార్టు వద్ద మంగళవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది.
చెన్నై: గోల్డెన్ బే రిసార్టు వద్ద మంగళవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పళని స్వామి పేరును చిన్నమ్మ తెరపైకి తీసుకు వచ్చింది.
ఆయనను పన్నీరుసెల్వం వర్గీయుల వ్యతిరేకిస్తున్నారు. రిసార్టు వద్దకు వెళ్లిన పన్నీరు వర్గీయులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
మరో ప్రమాదం!: పన్నీరుకు ఊహించని షాకిచ్చిన శశికళ
శశికళ వర్గీయులు కూడా ధీటుగానే స్పందించారు. తమ వైపు నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ తప్పించుకోలేదని చెప్పారు. శశికళకు శిక్ష పడినా తామంతా ధైర్యంగానే ఉన్నామని చెప్పారు. చిన్నమ్మ కూడా చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు.
ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ ఆహ్వానిస్తే వెళ్తామన్నారు. గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. తామంతా కలిసి కట్టుగా ఉన్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన పళని స్వామికి గవర్నర్ విద్యాసాగర రావు అపాయింటుమెంట్ ఇచ్చారు. సెంగొట్టాయన్తో కలిసి ఆయన రాజ్ భవన్ బయలుదేరారు.
సుప్రీం తీర్పు తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది.
సీఎం పీఠంపై శశికళ మరో ఎత్తు: పన్నీరుకు ఉద్వాసన, తెరపైకి పళనిస్వామి
దీంతో అన్నాడీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ స్థానంలో పళనిస్వామిని ఎన్నుకున్నారు. శశికళ జైలుకెళితే ఆవర్గంలోని ఎమ్మెల్యేలంతా తన వైపు వస్తారని పన్నీరు సెల్వం భావిస్తున్నారు.
కానీ పళనిస్వామిని శాసనసభాపక్షనేత ఎన్నుకోవడంతో శశికళ శిబిరంలో కొంత ఆందోళన తగ్గింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్న పన్నీర్ వర్గంలోని 12 మంది ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్కు వచ్చారు. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్సెల్వంకు మద్దతిచ్చేలా ఒప్పిస్తామని ఎంపీ అశోక్ కుమార్ తెలిపారు.
మరోవైపు... తమిళనాడులో అమ్మపాలనే కొనసాగనుందని, వివాదాలు తాత్కాలికమేనని, మనమంతా ఐకమత్యంగా ఉండాలని, పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని, జయలలిత ఆత్మ మనచుట్టే ఉందని పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖరాశారు.
తాము స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పన్నీరు సెల్వం చెప్పారు. అమ్మ ఆశీస్సులు మనకు ఉన్నాయనేందుకు ఇదే ఉదాహరణ అని.. శశికళ పైన వచ్చిన తీర్పును ఉద్దేశించి అన్నారు. ఇకపై మనం ఎవరి పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.