మరో జంటను కలిపిన సీజేఐ రమణ-ఈసారి పూణే దంపతులు-మధ్యవర్తిత్వానికి డిమాండ్
తాజాగా ఏపీకి చెందిన గుంటూరు జిల్లా దంపతుల్ని మధ్యవర్తిత్వం ద్వారా కలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు మరో జంటను కలిపారు. కుటుంబ కలహాల కారణంగా విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటను జస్టిస్ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం వీడియోకాల్ ద్వారా సంభాషించింది. మధ్యవర్తిత్వానికి దంపతులిద్దరూ అంగీకరించడంతో సుప్రీంకోర్టుకు ఆ మేరకు హామీ ఇవ్వాలని సూచించారు. సీజే కోరిన విధంగా హామీ ఇచ్చిన ఆ దంపతులు తిరిగి ఒక్కటయ్యారు.
మరో జంటను కలిపిన సీజేఐ రమణ
తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన కళ్లెం శ్రీనివాసశర్మ దంపతులను దాదాపు 20 ఏళ్ల తర్వాత కలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.. ఇప్పుడు మరో జంటను తన మధ్యవర్తిత్వంతో ఏకం చే్శారు. ఈ మధ్య కాలంలో తరచుగా మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లో, న్యాయవ్యవస్ధలో ప్రచారం చేస్తున్న ఎన్వీ రమణ.. దాన్ని ముందుగా తానే ఆచరణలో పెట్టి చూపుతున్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు వరకూ వచ్చిన మరో జంటకు భారీ ఊరట లభించింది.
పూణే భర్త, రాంచీ భార్య
మహారాష్ట్రలోని పూణేకు చెందిన వ్యక్తి, జార్ఘండ్ లోని రాంచీకి చెందిన యువతి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి కుటుంబంలో కలహాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. తన భర్త వేధిస్తున్నాడని భార్య కేసు పెట్టగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇందులో భార్యపై విడాకులు సహా పలు సెక్షన్లతో కేసులు వేశారు. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ మానవత్వంతో పరిశీలించారు. మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు.
వీడియోకాల్ సంభాషణతో
పూణేలో ఉన్న భర్త, రాంచీలో ఉన్న భార్యతోనూ వీడియోకాల్ ద్వారా సీజేఐ ఎన్వీ రమణతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా హిందీలో మాట్లాడారు వీరిద్దరూ ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. సంభాషణలో భర్త వద్దకు వెళ్లడం తనకు ఇష్టమేనని భార్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చెప్పింది. దీంతో వారు భార్యపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని భర్తకు సూచించారు. రెండు వారాల్లోగా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు భార్యను తన వెంట తీసుకెళ్లాలని వారు ఆదేశించారు. ఈ ప్రతిపాదనకు భర్త కూడా అంగీకరించారు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు మరో షరతు కూడా పెట్టింది. కొన్ని రోజులు మీ ప్రవర్తన పరిశీలిస్తామని, కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.
Recommended Video
మధ్యవర్తిత్వానికి పెరుగుతున్న డిమాండ్
మన దేశ న్యాయవ్యవస్ధలో కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్న సివిల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేలా దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టే స్వయంగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు ఇలాంటి సివిల్ కేసులు భారీగా వస్తున్నట్లు సమాచారం. దిగువ స్ధాయి కోర్టులు కూడా దీనిపై దృష్టిపెడితే మధ్యవర్తిత్వం ద్వారా చాలా మటుకు సివిల్ వివాదాలు, భార్యాభర్తల తగాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దీనికి న్యాయవ్యవస్ధ చట్టబద్ధత కూడా ఇస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మధ్యవర్తిత్వానికి మరింత డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.