యూపీ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎస్పీ బీఎస్పీ పొత్తు ఖరారు
రానున్న లోక్సభ ఎన్నిక్లల్లో ఉత్తర్ ప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు పొత్తులు ముగిశాక ఇక రెండు పార్టీలు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలపై దృష్టి సారించాయి. మధ్యప్రదేశ్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీకే పోటీచేసేందుకు ఎక్కువ సీట్లు దక్కాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్సభ స్థానాలుండగా... 26 సీట్లలో బీఎస్పీ పోటీచేయనుండగా ఎస్పీ మూడు స్థానాల్లోనే బరిలో నిలవనుంది. సమాజ్ వాదీ పార్టీ బాలాఘాట్, తికంగఢ్, ఖజూరగో స్థానాల నుంచి బరిలో నిలువనుంది.
ఇక ఉత్తరాఖండ్లో ఐదు లోక్సభ స్థానాలుండగా సమాజ్ వాదీ పార్టీ గర్హ్వాల్ ఒక్క సీటులో పోటీలో నిలవనుండగా... బహుజన్ సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాల్లో పోటీచేయనున్నట్లు మీడియా సంయుక్త సమావేశంలో సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. దీంతో పొత్తులపై ఎస్పీ బీఎస్పీ మూడు రాష్ట్రాలకు అధికారికంగా విస్తరించినట్లు అయ్యింది. ఇక రెండు పార్టీ మధ్య పొత్తు ప్రకటన జనవరి 13న వెలువడింది. ఉత్తర్ ప్రదేశ్లో బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనుండగా... ఎస్పీ 37 సీట్లలో బరిలో నిలవనుంది.
ఇక పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్తో కలవకూడదని రెండు పార్టీలు భావించాయి. అయితే కాంగ్రెస్ కూడా తమతోనే పొత్తులో ఉందని ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయించామనే ఆసక్తికర వ్యాఖ్యలు అఖిలేష్ యాదవ్ చేశారు. అయితే పొత్తుపై ప్రకటన చేస్తున్న సమయంలో అమేథీ, రాయ్బరేలీ పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలపడం లేదని అఖిలేష్ మాయావతిలు ప్రకటించారు. అమేథీ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ నుంచి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలు పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతవారం సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ పై ధ్వజమెత్తారు. మాయావతితో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.