కేబీసీ విన్నర్-కోటీశ్వరుడయ్యాక తలకిందులైన జీవితం-ఎంతగా పతనమయ్యాడంటే...
చాలామంది సామాన్యులు కోటీశ్వరులు కావాలని కలలు కంటారు. అతికొద్ది మంది మాత్రమే కృషిని నమ్ముకుని ఆ కలను నెరవేర్చుకుంటారు. కొంతమంది ఎంత కృషి చేసినా... ఎక్కడో దురదృష్టం వెంటాడుతుంది. పెద్దగా కష్టపడకుండానే షార్ట్ కట్లో కోటీశ్వరులయ్యేవారు కూడా ఉంటారు.అయితే అది ఎంతకాలం నిలుస్తుందనేది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే పాపులర్ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి' ద్వారా అక్షరాలా రూ.5 కోట్లు అందుకున్న ఓ కంటెస్టెంట్.. ఆ తర్వాతి కాలంలో దాదాపు దివాళా తీసే పరిస్థితికొచ్చాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అనూహ్యంగా కోటీశ్వరుడైన ఆ వ్యక్తి... తక్కువ కాలంలోనే మళ్లీ కిందకు పడిపోయాడు... ఎవరా వ్యక్తి... ఏమా కథా...
ఎవరా వ్యక్తి...
బిహార్కు చెందిన కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 5 విన్నర్ సుశీల్ కుమార్... ఆ క్విజ్ షోలో గెలిచాక తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. నిజానికి అంత డబ్బు గెలిచాక జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. కానీ సరైన పద్దతిలో ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల సుశీల్ కుమార్ ఒకానొక దశలో దివాళా తీసే పరిస్థితికొచ్చాడు. ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో... అతని మాటల్లోనే... 'కౌన్ బనేగా కరోడ్పతి షోలో గెలిచాక నా జీవితంలో అత్యంత చెత్త దశను చూశాను. 2015-2016 కాలం నా జీవితంలోనే అత్యంత సవాల్తో కూడుకున్నది. అప్పటికే జనం నన్ను సెలబ్రిటీలా చూడటం మొదలుపెట్టారు. చాలా కార్యక్రమాలకు నన్ను పిలుస్తున్నారు.' అని సుశీల్ కుమార్ తెలిపారు.
ఎంతో మంది మోసం చేశారు : సుశీల్ కుమార్
'అలా నెలలో 10 రోజులు,కొన్నిసార్లు 15 రోజులు ఆయా కార్యక్రమాలకు హాజరవుతుండేవాడిని. దీంతో నేను నా చదువుకు దూరమయ్యాను. అప్పట్లో మీడియాను చాలా సీరియస్గా తీసుకునేవాడిని. కొన్నిసార్లు జర్నలిస్టులు నన్ను ఇంటర్వ్యూ చేసి పత్రికల్లో రాస్తుండేవారు. నిజానికి నేనో నిరుద్యోగిని. కానీ జర్నలిస్టులు అడిగినప్పుడు ఏవో కొన్ని వ్యాపారాల గురించి,నేను చేస్తున్న పనుల గురించి చెప్పేవాడిని. కేబీసీ తర్వాత నిజానికి నేనో ఫిలాంత్రఫిస్ట్లా మారాను. చాలామందికి విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టాను. సీక్రెట్ డొనేషన్స్ చాలానే చేశాను. క్రమంగా నెలకు వేల సంఖ్యలో కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఈ క్రమంలో కొంతమంది నన్ను మోసం చేశారు. విరాళాలు ఇచ్చాక వారి అసలు రంగు నాకు తెలిసింది. నా వైఖరితో నా భార్య అసహనంగా ఉండేది. దీంతో ఆమెతోనూ విభేదాలు వచ్చాయి. ఆమె ఎప్పుడూ అంటుండేది... నీకు మంచివాళ్లెవరో,చెడ్డవాళ్లెవరో గుర్తించడం తెలియదని. నిజానికి నా భవిష్యత్తు గురించి ఆ సమయంలో నేనేమీ ఆలోచించేవాడిని కాదు.దీంతో భార్యతో తరుచూ గొడవలు జరిగేవి.' అని సుశీల్ కుమార్ చెప్పారు.
మద్యానికి బానిసయ్యాను : సుశీల్ కుమార్
'నా వృత్తిపరమైన సంబంధాల కారణంగా కొంతమంది మీడియాలో పనిచేసేవారు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొంతమంది థియేటర్ ఆర్టిస్టులు కూడా పరిచయమయ్యారు. నాతో వాళ్లు సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు నాకేమీ తెలియదనే అవగాహనకు వచ్చాను. అది నన్ను భయపెట్టేది. క్రమంగా మద్యానికి,ధూమపానానికి కూడా బానిసనయ్యాను. నేనెప్పుడు ఢిల్లీ వెళ్లినా... ఏడు గ్రూపులతో కలిసి తాగేవాడిని. వారితో మాట్లాడటం చాలా బాగుండేది. వారి సాన్నిహిత్యంలోనే మీడియాను లైట్ తీసుకోవాలని అర్థమైంది. అప్పటినుంచి మీడియాను లైట్ తీసుకుంటూ వచ్చాను.'అని సుశీల్ కుమార్ వెల్లడించారు.
అప్పటినుంచి నన్నెవరూ పిలవట్లేదు : సుశీల్ కుమార్
'నేను దివాళా తీశానని మీడియాలో వార్తలు వచ్చాయి. దీని వెనకాల ఓ సినిమాటిక్ కథ ఉంది. ఒకరోజు నేనలా పచార్లు కొడుతుండగా.. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు చెందిన జర్నలిస్ట్ వచ్చాడు. నన్ను ఇంటర్వ్యూ చేస్తూ పలు ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో అతను అడిగిన ఓ ప్రశ్న నాకు ఆగ్రహం,చికాకు తెప్పించాయి. దీంతో.. ఇక నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదని... అంతా ఖర్చయిపోయిందని చెప్పాను. కేవలం రెండు ఆవులను పెంచుకుంటూ... వాటి పాల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నానని తెలిపాను. ఆ వార్త అంతటా వ్యాపించింది. అప్పటినుంచి నన్నెవరూ ఏ కార్యక్రమాలకు పిలవవట్లేదు. ఎవరి నుంచి పిలుపులు రాలేదు. నా ఇంటర్వ్యూ కోసం ఎవరూ అడగలేదు.' అని వాపోయాడు.
ముంబై వెళ్లాక... అక్కడే కీలక నిర్ణయం...
'ఇక నా భార్యతో దాదాపుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ముంబై వెళ్లాను. సినిమా డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేశాను. తెలిసిన మిత్రుల వద్ద... వారి గదిలోనే ఉండేవాడిని. ఆ సమయంలో సినిమాల మీద సినిమాలు... విపరీతంగా చూశాను. చాలా పుస్తకాలు చదివాను. రోజుకు ఒక పెట్టె సిగరెట్లు కాల్చేవాడిని. ఆర్నెళ్ల దాకా ఇదే లైఫ్ స్టైల్. ఒక ప్రొడక్షన్ హౌస్కి స్క్రిప్ట్ కూడా రాశాను. అలా రూ.20వేలు నా చేతికి వచ్చాయిఆ సమయంలో నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం చిక్కింది. నిజానికి నేను సినిమా డైరెక్టర్ కావడం కాదు,ఒక టీచర్ అవాలని నిర్ణయించుకున్నాను.' అని సుశీల్ కుమార్ తన జీవితంలో తీసుకున్న మరో కీలక నిర్ణయం గురించి చెప్పారు.
ఇప్పుడు నా జీవితం సంతోషంగా సాగిపోతోంది : సుశీల్ కుమార్
'అలా ముంబై నుంచి ఇంటికి చేరుకున్నాక... సమస్యల నుంచి పారిపోవద్దని నిశ్చయించుకున్నాను. హృదయానికి నచ్చిన పనే చేయాలనుకున్నాను. టీచర్ ఉద్యోగం కోసం కష్టపడి చదివాను. అనుకున్నట్లు గానే జాబ్ సాధించాను. పర్యావరణానికి సంబంధించిన పనులూ చేశాను. అలా మనసుకు ప్రశాంతత లభించింది. 2016లో మద్యం,ఆ తర్వాత స్మోకింగ్ రెండూ మానేశాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ప్రతీరోజు ఒక వేడుకలానే బావిస్తున్నాను. కేవలం నేను బతికేందుకు అవసరమైన డబ్బును మాత్రమే సంపాదించాలనుకుంటున్నాను. ఇతరులకు తోచింది చేయడం,పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడాలని భావిస్తున్నాను.' అని సుశీల్ కుమార్ తన జీవితంలో ఎదురైన సంఘటనలను వివరించారు.