ఇక్కడ రేవంత్, అక్కడ నవజ్యోత్ సిద్దూ -పంజాబ్ పీసీసీ చీఫ్గా ఫైర్ బ్రాండ్? -సీఎంతో లొల్లి, ప్రియాంక ఫార్ములా!
చూడబోయే కాంగ్రెస్ పార్టీ తన పంథాను కొద్దిగా మార్చుకున్నట్లుంది. ఫేస్ టు ఫేస్ తలపడుతోన్న రాష్ట్రాల్లో బీజేపీని ధీటుగా నిలువరించడంతోపాటు ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ బలమైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నది. గతంలోలా అందరికీ ఆమోదయోగ్యమైన సౌమ్యులను కాకుండా, ఇతర పార్టీ నుంచి వచ్చి చేరిన ఫైర్ బ్రాండ్లకూ పెద్దపీట వేస్తున్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా తాను మారినట్లు సంకేతాలిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు పంజాబ్ లోనూ అనూహ్య ఎత్తుగడకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..
జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్
Amul milk: సామాన్యుడికి షాక్ -అమూల్ పాల ధరలు పెంపు -దేశవ్యాప్తంగా జులై 1నుంచే
పీసీసీ చీఫ్గా సిద్ధూ
ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా మాజీ క్రికెటర్ నవజ్యోగ్ సింగ్ సిద్ధూను నియమించే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కంటే పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు పంజాబ్ లో నెలకొన్నవేళ ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. వ్యవసాయ చట్టాలపై బీజేపీతో విభేదించిన అకాలీదళ్ ఏకంగా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేయడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆర్మీ పార్టీ(ఆప్) సైతం పంజాబ్ లో పాగాకు తీవ్రంగా శ్రమిస్తుండటంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ప్రధానంగా సిక్కులను తనవైపే ఉంచుకునేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నది. అందులో భాగంగానే ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన నవజ్యోత్ సింగ్ సిద్దూకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రియాంకతో భేటీ.. 48గంటల్లో నిర్ణయం
పంజాబ్ కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్దూ సూదీర్ఘంగా భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో విభేదాల నేపథ్యంలో ప్రియాంక సూచించిన ఫార్ములాకు సిద్ధూ అంగీకరించినట్లు తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ కు సంబంధించి సిద్ధూకు కీలక పదవి దక్కనుందని, రాబోయే 48 గంటల్లోనే ఆ పదవిపై ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సిద్దూకు పదవి ప్రకటన వెలువడిన తర్వాత ఆయన రాహుల్ గాంధీని కూడా కలుస్తారని సమాచారం. అయితే..
Recommended Video
రేవంత్ లాగే సిద్దూకూ చిక్కులు
పీసీసీ చీఫ్ పదవి విషయంలో తెలంగాణ నేత రేవంత్ రెడ్డి మాదిరిగానే పంజాబ్ లో నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం సొంతవాళ్ల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. సిద్దూకు పదవులను నిరాకరిస్తున్నారు. ''ఆయనకు డిప్యూటీ సీఎం లేదా పీసీసీ చీఫ్ పదవి దక్కడం నాకు సుతారమూ ఇష్టం లేదు''అని కెప్టెన్ మీడియా ముఖంగానే చెప్పేశారు. రెండేళ్లపాటు అమరీందర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి, 2019లోనే రాజీనామా చేసిన సిద్ధూ అనంతరకాలంలో సీఎంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో కెప్టెన్, సిద్దూల మధ్య గొడవకు ఏఐసీసీనే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. ప్రియాంక సూచించిన ఫార్ములాకు సిద్దూ ఒకే చెప్పగా, సీఎం అమరీందర్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.