క్రికెటర్ మనోజ్ తివారీ అనూహ్యం -మోదీని కాదని దీదీకి జై -టీఎంసీలో చేరిక -బెంగాల్ ఎన్నికల వేళ..
రైతు ఉద్యమంలో కుట్ర కోణం అంశంలో 'భారతరత్న' సచిన్ టెండూల్కర్ మొదలుకొని దాదాపు క్రికెటర్లందరూ కేంద్రానికి వంతపాడిన సందర్భంలో.. సెలబ్రిటీల ట్వీట్లను పప్పెట్ షోగా అభివర్ణిస్తూ, పరోక్షంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై అమిత్ షా కొడుకు జైషా ఆధిపత్యాన్ని ప్రశ్నించడంతోపాటు వసీం జాఫర్ బాధితుడిగా ఉన్న 'డ్రెస్సింగ్ రూమ్ లోకి మతం' ఆరోపణలపైనా తిరుగుబాటు గొంతుక వినిపించిన భాతర జట్టు ఆటగాడు మనోజ్ తివారీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు..

తివారీ కొత్త ఇన్నింగ్స్
పశ్చిమ బెంగాల్ కు చెందిన మనోజ్ తివారీ.. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (టీఎంసీ) చేరాడు. హుగ్లీలో బుధవారం జరిగిన ఓ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పార్టీ కండువ కప్పి.. తివారీని టీఎంసీలోకి చేర్చుకున్నారు. 35 ఏండ్ల మనోజ్.. ఇప్పటివరకు పశ్చిమబెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్గా, భారత జాతీయ జట్టు సభ్యుడిగా సత్తా చాటుకున్నాడు. దేశం తరఫున 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా,

చోటా దాదా ఎంట్రీతో దీదీకి రిలీఫ్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నుంచి భారీ ఎత్తున బీజేపీలోకి వలసలు వెల్లువ కొనసాగుతోంది. సీఎం మమతకు కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కొందరు మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కాషాయదళంలో చేరిపోతున్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, నేతలు వరుసగా పార్టీని వీడుతుండటం టీఎంసీకి ఇబ్బందికర పరిణమామంగా మారింది. అదీగాక, బెంగాల్ సీనీ, క్రీడా ప్రముఖులను బీజేపీ పెద్దలు నేరుగా కలుస్తూ, టీమ్ మోదీతో కలిసి నడవాలని ఓపెన్ ఆఫర్లిస్తున్న తరుణంలో.. బెంగాల్లో చోటా దాదాగా పేరున్న మనోజ్ తివారీ మాత్రం దీదీవైపు నిలబడటం టీఎంసీకి రిలీఫ్ లాంటిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక దశలో తివారీని సైతం బీజేపీ నేతలు సంప్రదించినట్లు సమాచారం. నిజానికి..

గతంలో చేరినవాళ్ల పరిస్థితేంటి?
క్షేత్ర స్థాయిలో బలాబలాల సంగతి అటుంచితే, చాలా రాష్ట్రాల్లో బీజేపీ(మిగతా పార్టీలతో పోల్చుకుంటే) సెలబ్రిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం, అలా టికెట్లిచ్చిన వాటిలో మెజార్టీ శాతం సీట్లు కైవసం చేసుకోవడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో మమత కూడా ఇదే తరహా ఎత్తుగడను అవలంభించారు. 2016 ఎన్నికల్లో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లాకు హౌరా నార్త్ టికెట్ ఇచ్చిన మమత.. గెలిచిన తర్వాత శుక్లాకు యువజన సర్వీలు, క్రీడాభివృద్ధి శాఖను కూడా కట్టబెట్టారు. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే శుక్లా.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, క్రీడలపై ఫోకస్ పెంచడానికే రాజకీయాల నుంచి తప్పుకున్నానని శుక్లా ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీతోనూ మమతకు ప్రత్యేక అనుబంధం ఉన్నప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా దీదీకి దాదా మద్దతు అసాధ్యం. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో జరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications