లోకల్ పోల్స్: బీజేపీలో జేడీఎస్ విలీనమంటూ వార్తలు, కుమారస్వామి స్పందన ఇది
బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో జేడీఎస్ను విలీనం చేస్తారని వస్తున్న వార్తలు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పందించారు. అవన్నీ వదంతులేనని తేల్చేశారు. జాతీయ పార్టీలో గానీ, ప్రాంతీయ పార్టీలతో గానీ జేడీఎస్ విలీనం కాదని స్పష్టం చేశారు.
తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. బీజేపీ అంతర్గత రాజకీయ నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను విలీనం లేదా సంకీర్ణం గురించి ఆలోచించడం లేదని తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లు కష్టపడి పూర్తిస్థాయి మెజార్టీ తెచ్చుకునేందుకు కృషి చేస్తానని కుమారస్వామి స్పష్టం చేశారు. అయితే, బీజేపీకి పలు అంశాల్లో దశలవారీగా మద్దతు ఉంటుందని తెలిపారు.
48,048 మంది సభ్యులను ఎన్నుకోవటానికి 117 తాలూకాలలో 3019 గ్రామ పంచాయతీలకు (జిపి) మంగళవారం రాజకీయ పార్టీలు మొదటి దశ ఓటింగ్కు సిద్ధమైనప్పటికీ.. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు పొత్తులు, విలీనాలు ఉండవని మళ్లీ పునరుద్ఘాటించాయి. డిసెంబర్ 22, 27 తేదీల్లో జీపీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. డిసెంబర్ 30 న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది ఇలావుంటే, జేడీఎస్.. బీజేపీలో విలీనమవుతుందనే వార్తలను బీజేపీ కూడా కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమైనవేనని తెలిపింది. కర్ణాటక బీజేపీ అధికార ప్రతినిధి కెప్టెన్ గణేష్ కర్నిక్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా 80 శాతం సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో జేడీఎస్ విలీనమవుతుందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, జేడీఎస్లోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం.