ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఎంజీపీతో సంప్రదింపులు జరుపుతున్నామన్న సీఎం సావంత్, హంగ్ వస్తే ఇలా
పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అయితే, పలు ఎగ్జిట్ పోల్స్ గోవాలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
చాలా ఎగ్జిట్ పోల్స్ గోవాలో హంగ్ అసెంబ్లీని అంచనా వేయడంతో, రాష్ట్రంలోని పురాతన ప్రాంతీయ పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీని కోస్తా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్లచే ప్రలోభపెడుతున్నాయి.
గోవాలోని రెండు ప్రధాన పార్టీలైన పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ తాము మెజారిటీ సీట్లు గెలుస్తామని చెబుతున్నప్పటికీ.. వారు మెజారిటీ మార్కు 21 కంటే తక్కువగా ఉన్నట్లయితే దీపక్ ధవలికర్ నేతృత్వంలోని ఎంజీపీ మద్దతు కోరతామని కూడా చెప్పాయి. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించగా మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ, మనోహర్ పారికర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంజీపీ (మూడు సీట్లు గెలుచుకుంది), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), స్వతంత్రులతో త్వరగా పొత్తు పెట్టుకుంది.
2019లో, పారికర్ మరణానంతరం సావంత్ ముఖ్యమంత్రి అయినప్పుడు, రాష్ట్ర మంత్రివర్గం నుండి ఇద్దరు ఎంంజీపీ మంత్రులను తొలగించారు. ఈసారి, ఎంజీపీ... మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో పొత్తుతో రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసింది.
ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం పిటిఐతో మాట్లాడుతూ.. కాషాయ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో కేంద్ర బిజెపి నాయకత్వం ఇప్పటికే ఎంజీపీ మద్దతు కోసం చర్చలు జరుపుతోందని చెప్పారు. ఈసారి బీజేపీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ విజయ్ సర్దేశాయ్ జీఎఫ్పీతో పొత్తు పెట్టుకుంది.
Recommended Video
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ గోవా డెస్క్ ఇన్చార్జి దినేష్ గుండూరావు ఆదివారం మాట్లాడుతూ.. తమ పార్టీ మెజారిటీ మార్కుకు తగ్గితే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఎంజీపీ, టీఎంసీ వంటి సంస్థల మద్దతును కోరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇతర పార్టీల మద్దతు కోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను క్యాంపులకు కూడా తరలించింది.












Click it and Unblock the Notifications