ప్రజలకు సమాధానం చెబుతాం: అమ్మ ఆరోగ్యంపై అన్నాడీఎంకే ప్రకటన
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఒక ప్రకటన చేసింది. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్స జరుగుతోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి రామచంద్రన్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అమ్మకు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జయలలితకు చికిత్స అందిస్తున్న ఫోటోలను విడుదల చేయాలని ప్రతిపక్ష నేతలు చేసిన డిమాండ్పై కూడా ఆయన స్పందించారు.
అమ్మకేమైంది?: అంతా రహస్యమే, టెన్షన్
మేం ప్రజలకు సమాధానం చెబుతాం కానీ, ప్రతిపక్షాలకు కాదని రామచంద్రన్ వ్యాఖ్యానించారు. వైద్యులు మాత్రమే అమ్మ ఆరోగ్యంగా మాట్లాడగలరని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సీఎం జయలలితకు ఏమైందోనని అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు ప్రజలు సైతం ఆందోళనలో ఉన్నారు.
సెప్టెంబర్ 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్తో జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే గత రెండు రోజులు నుంచి ఆమె ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులిటెన్లు కూడా విడుదల చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అపోలో ఆసుపత్రిలో అసలేం జరుగుతుందో చెప్పాలని సుప్రీం కోర్టు న్యాయవాది రీగన్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి అంత రహస్యం ఎందుకు పాటిస్తున్నారో తెలుసుకోవాలంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద వెయ్యి మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు జయలలిత ఆరోగ్యంపై స్పందించకపోవడంపై డీఎంకే అధినేత కరుణానిధి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Puratchi Thalaivi Amma responded well to the treatment,Amma has been advised a few days stay in the hospital for treatment - Apollo Hospital pic.twitter.com/zFKexZVm5I
— AIADMK (@AIADMKOfficial) September 29, 2016