NDA- AIADMK కు విజయ్ మాస్టర్ స్ట్రోక్: రాహుల్ కోరుకున్నట్లుగా, నెక్స్ట్ టార్గెట్..!!
తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మెజార్టీ సంఖ్య కోసం సీఎం అయ్యే అవకాశం ఉన్నా మూడు రోజులు వేచి చూసిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. అసెంబ్లీలో బల నిరూపణ వేళ ఎన్డీఏ- అన్నా డీఎంకే కు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. అన్నా డీఎంకే నిలువునా చీలింది. 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు దూకారు. ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీని ద్వారా రాహుల్ గాంధీ- స్టాలిన్ కోరుకున్న విధంగా పావులు కదులుతున్నాయి.
అన్నా డీఎంకే నిలువునా చీలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే లో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగం కు మద్దతు ప్రకటించింది. ఆయన వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేతో చేతులు కలపాలని అన్నాడీఎంకే అనుకుందని, అందుకే పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోయామని షణ్ముగం తెలిపారు. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. వరుస ఓటములకు పళనిస్వామే కారణమని విమర్శించారు. పార్టీ పదవి నుంచి ఆయన దిగిపోవాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే గత దశాబ్ద కాలంగా పలు ఓటములను చవిచూసిందని, మూడుసార్లు చిరకాల ప్రత్యర్థి డీఎంకే చేతిలో ఓడిపోతే, గత నెలలో టీవీకే చేతిలో మరో ఓటమి చవిచూసిందని షణ్ముగం తెలిపారు. పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్నాడీఎంకే భవిష్యత్తుపై కూలంకషంగా చర్చించాలని అన్నారు.

బయట నుంచి విజయ్ కు అన్నా డీఎంకే మద్దతు
ఇదే సమయంలో ఎన్నికల్లో విజేతగా నిలిచిన టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. డీఎంకేకు వ్యతిరేకంగానే అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని.. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే పార్టీ రాజకీయాలు నడిచాయని వివరించారు. చరిత్ర ఇలా ఉంటే డీఎంకే మద్దతు తో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అయితే మెజారిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం అంటే అన్నాడీఎంకే సొంత ఉనికి కోల్పోవడమే అవుతుంది. ప్రస్తుతం మా దృష్టి ఉంతా పొత్తులపై లేదు. సొంత పార్టీని పునరుద్ధరించి, పటిష్టం చేయడమే మా ఉద్దేశం. అంతిమంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షణ్ముగం తెలిపారు. రేపు అసెంబ్లీలో విజయ్ బల పరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ సాయంత్రం షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ను కలిసి మద్దతు ప్రకటించనున్నారు. దీంతో.. అన్నా డీఎంకే - ఎన్డీఏ కు భారీ దెబ్బగా భావిస్తున్నారు. ఇక.. రానున్న రోజుల్లో తమిళనాడు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications