బ్యూటీపార్లల్ పుష్పా ఆంటీ నేడు ఎంపీ (ఫోటోలు)
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప గత ఆరేళ్లలో తనకు అడ్డు వచ్చిన మంత్రులు, నాయకులను మట్టికరిపించింది. సొంత జిల్లా అయిన తూత్తుకుడి, చైన్నైలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.
చెన్నైలోని అన్నా నగర్ లో నివాసం ఉంటున్న శశికళ పుష్ప రాజకీయ ప్రవేశం చెయ్యకముందు ఏం చేశారో తెలుసా ? ఆమె ఓ బ్యూటీ పార్లర్ నిర్వహించేది. ముఖ్యమంత్రి జయలలిత కార్యదర్శిగా ఉన్న ఓ అధికారి శశికళ పుష్పకు పరిచయం అయ్యారు.
ఆ పరిచయంతో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. అన్నాడీఎంకే పార్టీ పాత సభ్యత్వ కార్డులను పొందడానికి ఎన్నో మార్గాలున్నాయని సమాచారం. శశికళ పుష్ప అదే దారిలో వెళ్లారు. పార్టీ అరంభకాలపు సభ్యుడి గుర్తింపు కార్డు నెంబర్ సంపాధించారు.
గొప్పలు చెప్పుకుంది
తాను పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగారు. పార్టీ అధిష్టాన వర్గంలో తనపలుకుబడి పెంచుకుంది. పార్టీ నాయకులతో చనువుగా ఉంటూ అందరికి దగ్గరయ్యింది.
తూత్తుకుడి మేయర్ గా
పార్టీలో ఉన్న పలుకుబడితో తూత్తుకూడి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసిన శశికళ పుష్ప విజయం సాధించారు. చెన్నైలో నివాసం ఉంటున్న శశికళ పుష్ప తూత్తుకుడి మేయర్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ఆ జిల్లా అన్నాడీఎంకే పార్టీ నాయకులు అప్పుడు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతీకారం తీర్చుకుంది
స్థానిక నాయకుల మీద అసత్యప్రచారం చేసిన శశికళ పుష్ప తనకు అడ్డు వచ్చిన వారిని పార్టీ నుంచి బయటకు వెళ్లే విధంగా ప్లాన్ చేసింది.
కాంట్రాక్టర్ల మీద కన్ను పడింది
సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్లతో పాటు ప్రతిపక్షాలకు చెందిన కాంట్రాక్టర్లను తన వైపుకు తిప్పుకుంది. కాంట్రాక్టర్లకు విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులను తన అనుచరులకు ఇప్పించుకున్నారు.
రాజ్యసభ సీటుకు ప్లాన్
మొదట తూత్తుకుడి జిల్లా పరిషత్ నాయకుడు చిన్నదురైని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే చిన్నదురై మీద అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన పోటీ నుంచి తప్పుకునేలా చేసింది. తరువాత రాజ్యసభకు శశికళ పుష్పా ఎన్నికయ్యారు.
మంత్రి పదవులు పోయాయి
రాజ్యసభకు తనను ఎంపిక చేసిన సమయంలో అడ్డుకున్న మంత్రుల పదవులు పోయేలా శశికళ ప్లాన్ వేసి సక్సస్ అయ్యారు. తిరువన్నియూరులో పార్టీ కార్యచరణ మండలి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నాయకులు వారి ఫోటోలు లేకుండా అమ్మ ఫోటోతో ప్రకటనలు ఇచ్చారు.
అమ్మకు పూలహారం వేసిన ఫోటోతో
ముఖ్యమంత్రి జయలలితకు పూలమాల వేస్తున్న ఫోటోతో శశికళ కొన్ని పత్రికలకు మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటన వెనుక ఉన్న మతలబు తెలుసుకున్న అధిష్టానం మహిళా విభాగం అధ్యక్షురాలి పదవి నుంచి శశికళను తప్పించారు. అప్పటి నుంచి ఆమెకు సొంత పార్టీలో వ్యతిరేకులు ఎక్కువయ్యారు.
వాట్సాప్ లో మత్తులో జరిపిన సంభాషణలు
తూత్తుకుడికి చెందిన స్నేహితుడితో శశికళ మత్తులో జరిపిన సంభాషణలు వాట్సాప్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఆమె తీరుపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారు.
ఎంపీ మీద చెయ్యి చేసుకుని
సొంత పార్టీ ఎంపీ అయిన తిరుచ్చి శివ మీద ఢిల్లీ విమానాశ్రయంలో చెయ్యి చేసుకున్న శశికళను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలని జయలలిత ఆదేశాలు జారీ చేశారు. ఆ మరుసటి రోజు ఢిల్లీలో తన పదవికి రాజీనామా చెయ్యాలని చెప్పి తనను కొట్టారని జయలలిత మీద ఆరోపణలు చేశారు. తరువాత శశికళను పార్టీ నుంచి బహిష్కరించారు.
అంతే వేగంతో కిందకు వచ్చింది
అన్నాడీఎంకే పార్టీలో ఎంత వేగంగా పైకి వెళ్లారో అంతే వేగంగా ఆమె పాతాళంలోకి పడిపోయారు. ఇప్పుడు జయలలితను ధిక్కరించి ఆమె మీదే ఆరోపణలు చేస్తున్నారు. శశికళ మీద పలువురు అనేక విధాలుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.