అన్నాడీఎంకేలో మూడుముక్కలాట: ఆట మొదలు పెట్టిన దినకరన్, మళ్లీ ఏం చేస్తాడో ?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదల అయిన వెంటనే చెన్నైలో వాలిపోయాడు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని దినకరన్ పక్కా ప్లాన్ వేస్తున్నాడని వెలుగు చూసింది.
పన్నీర్ సెల్వంకు భారీ దెబ్బ: ఎమ్మెల్యేలు శశికళ వర్గంలోకి జంప్, ఫస్ట్ వికెట్ పడింది!
ఇప్పటికే శశికళ మీద తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ వర్గం తయారు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఓ వర్గం తయారు చేసుకున్నారు. టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లిన తరువాత రెండు వర్గాలు కలిసిపోవాలని, విలీనం చర్చలు మొదలు పెట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసి చివరికి విరమించుకున్నారు.
టీటీవీ అంటే ఏమిటో చూపిస్తా ?
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎర వేశారని ఆరోపిస్తూ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు టీటీవీ దినకనర్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన టీటీవీ దినకరన్ ఇప్పుడు జామీను మీద బయటకు వచ్చి తాను ఎంటో చూపిస్తా ? అంటూ సవాలు చేస్తున్నారని తెలిసింది.
నాకు ఓ వర్గం ఉంది !
చెన్నైలో అడుగుపెట్టిన వెంటనే కొందరు ఎమ్మెల్యేలతో టీటీవీ దినకరన్ మంతనాలు జరిపారని వెలుగు చూసింది. ఎడప్పాడి పళనిసామి మీద అసమ్మతితో ఉన్న కొందురు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ తో చర్చలు జరిపారని సమాచారం.
మరో వర్గం ఎందుకంటే ?
ఎడప్పాడి పళనిసామి ఇంత వరకు ఒక్క సారికూడా బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లి శశికళను పరామర్శించలేదు. టీటీవీ దినకనర్ తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీ వెళ్లిన పళనిసామి అటు వైపు కన్నెత్తికూడా చూడలేదు. అందుకే ఆయనను ఓ ఆట ఆడించాలని దినకరన్ మరో గ్రూపు తయారు చేస్తున్నారని సమాచారం.
ఎడప్పాడిపైన అసంతృప్తి ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. తాను జైలుకు వెళ్లిన తరువాత అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనం కోసం చర్చలు జరపడానికి ప్రయత్నించారని, పన్నీర్ సెల్వంతో రాజీ కావడానికి ప్రయత్నించిన పళనిసామి మీద దినకరన్ ప్రత్యక్షంగానే మండిపడుతున్నారని సమాచారం.
నాతో ఎవరు ఉంటారు ?
తనతో కలిసి పని చెయ్యడానికి సిద్దంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ? వారెవరు ? అంటూ దినకరన్ ఓ జాబితా తయారు చేసుకుంటున్నారని సమాచారం. మొదటి నుంచి టీటీవీ దినకరన్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
మళ్లీ కష్టాలు మొదలైనట్లే ?
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు విచ్చలవిడిగా నగదు బట్వాడ చేశారని టీటీవీ దినకరన్ వర్గీయులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, దినకరన్ కు మద్దతు ఇచ్చిన శరత్ కుమార్, ఆయన భార్య రాధిక కార్యాలయాల మీద ఐటీ శాఖ దాడులు చేసింది. ఇప్పుడు దినకరన్ చేసే చేష్టలకు మళ్లీ కష్టాలు ఎదురైయ్యే అవకాశం ఉందని పలువురు మంత్రులు హడలిపోతున్నారని సమాచారం.
మూడు ముక్కలాట మొదలైయ్యిందా ?
అన్నాడీఎంకేలో ఇప్పుడు మూడుముక్కలాట మొదలైయ్యిందా ? అంటే అవుననే అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిసామి, టీటీవీ దినకరన్ కలిసి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పంచుకుని మూడు వర్గాలుగా తయారయ్యారని అంటున్నారు.