జయ వీలునామాపై మాటల్లేవు: వారసులెవరు, శశికళకు బాసటగా...
జయలలిత వీలునామాపై మాట్లాడేందుకు అన్నాడియంకె నిరాకరించింది. దానిపై మాటల్లేవని సి. పొన్నియన్ అన్నారు. అదే సమయంలో జయలలిత వారసులు ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీలునామాపై మాట్లాడేందుకు అన్నాడీఎంకే నిరాకరించింది. రూ.113.72 కోట్ల విలువైన ఆస్తులపై జయ ఏమైనా వీలునామా రాశారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయన్ నిరాకరించారు.
ఈ ప్రశ్నకు సమాధానం లేదని అన్నారు. అంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జయలలిత తన ఎన్నికల అఫిడవిట్లో పోయెస్ గార్డెన్ సహా తనకున్న పలు ఆస్తులను వెల్లడించారు. అ ఫిడవిట్లో వెల్లడించిన మేరకు ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.113.72 కోట్లు. వీటిలో చరాస్తుల విలువ రూ41.63 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.72.0 కోట్లు.
జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ను స్మారక చిహ్నంగా మారుస్తారా? అన్న ప్రశ్నకు విషయాన్ని పార్టీ హైకమాండ్, ప్రధాన కార్యదర్సి, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుందని పొన్నియన్ అన్నారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులైన నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారుతాయనేది చెప్పలేని పరిస్థితి ఉంది.
శశికళకు పార్టీ బాసట
జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ అనుమానాలన్నీ జయలలితను లక్ష్యం చేసుకుని ముందుకు వస్తున్నాయి. ఈ స్థితిలో అన్నాడీఎంకే మాత్రం శశికళ చాలా ముఖ్యమైన వ్యక్తి అని, జయ విషయంలో అలా చేయదని అంటోంది. అదే సమయంలో ఆమె మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపారు.
శశికళ మేనల్లుడు దివాకరన్ ఇలా..
తన ఫేస్బుక్ పేజీ వేదికగా శశికళ మేనల్లుడు జియానంద్ దివాకరన్ ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. శశికళ కుటుంబం జయలలిత కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కుని, ఆమెకు అండగా నిలిచిందని జియానంద్ పోస్ట్ చేశాడు. ప్రాణాపాయం నుంచి జయలలితను మూడు సార్లు శశికళ సోదరుడు కాపాడాడని ఓ ఫోటో పోస్ట్ చేశాడు. జయలలిత ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై లాఠీ చార్జి జరగకుండా ఉండేందకు శశికళ సోదరుడు లాఠీ దెబ్బలకు ఎదురునిలిచాడని పోస్ట్ చేశాడు. ఆ లాఠీచార్జ్లో దివాకరన్కు 14 చోట్ల గాయాలయ్యాయని పోస్ట్ చేశాడు.
జయలలిత రక్తసంబంధీకులు ఉంటే..
చట్ట ప్రకారం, రక్త సంబంధీకులెవరైనా ఉంటే జయలలిత ఆస్తులు వారికే చెందుతాయనే వాదన ముందుకు వచ్చింది. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి అలా లేదని చెబుతున్నారు. శశికళ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని ప్రచారం సాగుతోంది.
జయలలిత రక్తసంబంధీకులు ఎవరు?
ఎన్.రాగచార్ కుమారుడు జయరాం. బెంగళూరులో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆయన మొదటి భార్య జయమ్మ. ఈ దంపతులకు కలిగిన సంతానం వాసుదేవన్. ప్రస్తుతం ఆయన తన భార్యాబిడ్డలతో మైసూరులోనే ఉంటున్నారు. జయమ్మ కన్నుమూయడంతో జయరాం వేదవల్లి అలియాస్ సంధ్యను వివాహం చేసుకున్నారు. అప్పటికి జయలలిత వయసు రెండేళ్లు. ఆ తర్వాత జయరాం, వేదవల్లి దంపతులకు జయకుమార్ జన్మించాడు. జయకుమార్ 1995లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయకుమార్కు దీపక్, దీప అనే ఇద్దరు సంతానం.
అంత్యక్రియల్లో శశికళతో పాటు అతను..
దీపక్ శశికళతో కలిసి జయలలిత అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు, దీపను మాత్రం రానీయలేదని చెబుతారు. ఇలా చూస్తే జయ రక్త సంబంధీకులు దీపక్, దీప మాత్రమే. అయితే, దీపక్ శశికళ వైపు మళ్లినట్లు చెబపుతున్నారు. దీప తన మేనత్త వద్దకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోయెస్ గార్డెనలో జయ మృతదేహానికి స్నానాదులు చేయించేటప్పుడు దీపను కూడా పిలవాలని కొందరు సీనియర్లు చెప్పినా శశికళ బృందం నిరాకరించారని సమాచారం. రాజాజీ హాలు వద్ద జయ మృతదేహం ఉన్నప్పుడు అక్కడికొచ్చిన దీపను క్షణాల్లోనే పంపించేశారని సమాచారం. జయ మృతదేహాన్ని తీసుకెళ్లే సైనిక శకటం ఎక్కేందుకు దీప చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
దీపక్ను నటరాజన్ తన వెంటే ఉంచుకున్నారు..
దీపక్ను శశికళ భర్త నటరాజన్ తన వెంటే ఉంచుకున్నారని, ఉదయం నుంచీ తన వెంటే ఉంచుకున్న నటరాజన్ కనీసం బయటకు కూడా వెళ్లనీయలేదని తమకు సమాచారం ఉందంటూ కొన్ని పత్రికలు రాశాయి. దీపక్తో శశికళ బృందం టచ్లో ఉందని, అతన్ని దరి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. రక్త సంబంధీకులకే ఆస్తిపాస్తులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దీపక్ను ప్రయోగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
వేద నిలయం సంధ్య పేరు మీదే ఉండేది..
పోయెస్ గార్డెన్లోని వేదనిలయం మొదట్లో జయలలిత తల్లి సంధ్య పేరు మీదనే ఉండేదని సమాచారం. ఆమె పేరు మీదనే జయ ఆ ఇంటికి వేదనిలయమని పేరు పెట్టారు. మాతృమూర్తి సంధ్య పేరుపై ఉండేది. ఆ తర్వాత అది జయకు వారసత్వంగా వచ్చింది. అంటే ఆ ఇల్లు దీపక్ నాయనమ్మది అవుతుంది. చట్ట ప్రకారం ఆ భవనానికి పూర్తి వారసుడు అతనే అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఎంజిఆర్ విషయంలో ఇలా జరిగింది...
గతంలో ఎంజి రామచంద్రన్ రాసిన వీలునామా వల్ల ఆయన ఆస్తులన్నింటినీ మొదట న్యాయవాది రాఘవాచారి పర్యవేక్షించారు. అనంతరం ఎంజీఆర్ బంధువైన రాజేంద్రన్ స్వాధీనంలోకి వెళ్లాయి. ఆ తర్వాతి పరిణామాల్లో అవి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలోకి వెళ్లాయి. ఇప్పుటికీ అలాగే ఉన్నాయి. ఇలా జరగకుండా శశికళ దీపక్ను చేరదీసినట్లు చెబుతున్నారు.