షాకింగ్: కొవాగ్జిన్ ట్రయల్స్కు వాలంటీర్లు లేరు -ఆందోళనలో ఎయిమ్స్ -ప్రజలకు పిలుపు
భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానుండగా.. కొవాగ్జిన్ ట్రయల్స్ విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సహకారంతో రూపొందుతోన్న తొలి దేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, ఎయిమ్స్ తనవంతు సహకారాన్ని అందించింది. మిగతా వ్యాక్సిన్ల ట్రయల్స్ జోరుగా సాగుతున్నా.. కొవాగ్జిన్ ప్రయోగాలకు మాత్రం వాలంటీర్లు ముందుకురాని దుస్థితి నెలకొంది.
కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు వాలంటీర్ల కొరత ఏర్పడిందని, ప్రయోగాల్లో పాల్గొనేందుకు జనం ముందుకు రావడంలేదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు అవసరమైన వాలంటీర్లు దొరకడం లేదని ఆ సంస్థ పేర్కొంది. కరోనా టీకా త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందన్న భావన నెలకొనడంతో క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనడానికి వాలంటీర్లు ఆసక్తి చూపడంలేదని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.

కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్కు 1500-2,000 మంది వరకు వాలంటీర్లు అవసరం కాగా.. ఇప్పటివరకు 200 మంది మాత్రమే ముందుకు వచ్చినట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా వ్యవహరిస్తున్న ఎయిమ్స్ అధికారి డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు. తొలి దశ ప్రయోగాలకు 100 మంది అవసరమైతే 4,500 మంది ఆసక్తి చూపారని, రెండో దశ ట్రయల్స్కు 4వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రకటనలు, ఈ మెయిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సంజయ్ సూచించారు.
కొవాగ్జిన్ ట్రంయల్స్ కు సంబంధించి మొదటి దశలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 100 మంది పాల్గొనాల్సి ప్రయోగాలకు గరిష్టంగా 4,500 దరఖాస్తులు వచ్చాయి. కానీ ప్రస్తుత మూడో దశకు మాత్రం వాలంటీర్లు రావడంలేదు. ఒక వారం లేదా 15 రోజుల్లో దేశంలో టీకా అందుబాటులోకి వస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో ఉందని, కాబట్టి కొవాగ్జిన్ ట్రయల్స్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని అధికారులు అంటున్నారు. కొవాగ్జిన్ సురక్షితమైందని, అంతగా దుష్ప్రభావాలు తలెత్తలేదని తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను సంస్థ ఇటీవలే ప్రకటించింది.












Click it and Unblock the Notifications