తప్పిన ముప్పు: ఎంహెచ్ 17 వెనకే భారత విమానం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి గురువారం రాత్రి ముప్పు తప్పింది. కూల్చివేతకు గురైన మలేషియా విమానం ఎంహెచ్ 17 వెనకే ఎయిర్ ఇండియాకు చెందిన విమానం వస్తోంది. ఎయిర్ ఇండియా విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. భారత విమానం బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి వస్తోంది.
అదే సమయంలో సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం కూడా కోహెన్హాగన్ నుంచి స్వదేశానికి వస్తోంది. ఈ రెండు విమానాలు కూడా కూల్చివేతకు గురైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం బోయింగ్ 777కు 25 నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి.
నిజానికి ఆ గ్యాప్ను పైలట్లు ఐదు నిమిషాల్లో పూరించగలరు. ఈ రెండు విమానాలు కూడా అతి దగ్గర నుంచి ముప్పు నుంచి తప్పించుకున్నాయి. ఎయిర్ ఇండియా ఎఐ 113 విమానం వేరే మార్గాన్ని ఎంచుకుందని అంటున్నారు. ఉక్రెయిన్ వివాద ప్రాంతం నుంచి రావద్దని ఎఐ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్పిఎస్ సూరి ఆదేశాలు ఇచ్చారు.
తరుచుగా యుద్ధం సాగుతుండడంతో ఉక్రెయిన్ మీదుగా పలు దేశాలు తమ విమానాల రాకపోకలను రద్దు చేశాయి. అయితే, పశ్చిమ ఐరోపాకు, ఆగ్నేయాసియాకు ఇది రుజుమార్గం కావడంతో కొన్ని దేశాలు ఆ మార్గాన్ని వాడుతున్నాయి.
అయితే, తాము భూమికి 33 వేల అడుగుల ఎత్తున ఉంటాం కాబట్టి తమకేమీ కాదని పైలట్లు, ఎయిర్లైన్స్ భావిస్తుండడం వల్ల ఆ మార్గంలో విమానాలు నడుస్తున్నాయి. అయితే, ఎంహెచ్ ఆ భ్రమను బద్దలు కొట్టింది. ఇరాక్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా వచ్చేప్పుడు పైలట్లు చాలా అప్రమత్తంగా ఉంటారు.