Air India విమానంలో మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి అరెస్ట్- పైలట్, సిబ్బందికి నోటీసులు
గత ఏడాది నవంబర్ లో న్యూయార్క్ నుండి ప్రయాణిస్తున్న విమానంలో తన తోటి ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన వ్యవహారంలో ఎయిర్ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ ఇవాళ క్షమాపణలు చెప్పారు. అలాగే నలుగురు క్యాబిన్ సిబ్బంది, పైలట్ను విధుల నుంచి తప్పించారు. దీంతో పాటు తమ ఎయిర్లైన్ విధానాన్ని సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
తమ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనపై సమీక్షించిన ఎయిర్ ఇండియా..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఇవాళ తెలిపింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే రిపోర్ట్ చేసే వ్యవస్ధను అమల్లోకి తెస్తామని ప్రకటించింది. తాజా ఘటనపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఇవాళ వెల్లడించింది. అలాగే జరిగిన ఘటనలో చోటు చేసుకున్న లోపాలపై సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
తాజా ఘటన నేపథ్యంలో ఇకపై తమ ఎయిర్ లైన్ విధానాన్ని సమీక్షిస్తామని, ముఖ్యంగా మద్యం అనుమతించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఇవాళ వెల్లడించింది. అలాగే ఆ ఘటన జరిగినప్పుడు విమానంలో ఉన్న తమ పైలట్లతో పాటు సిబ్బందికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమానంలో మద్యం సేవించడం, ఈ ఘటన ను హ్యాండిల్ చేయడం,బోర్డులో ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల నిర్వహణ వంటి అంశాలను ఎయిర్లైన్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ ఘటనకు కారకుడైన తాగుబోతు శంకర్ మిశ్రాను బెంగళూరులో ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ను ఇవాళ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.