ఎయిర్ ఫోర్స్కు థ్యాంక్స్: కవలలకు జన్మనిచ్చిన గర్భిణి
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది. వరద సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏముందీ ఆ వీడియోలో అనుకుంటున్నారా? భారీ వర్షాలు, వరదలు చెన్నై నగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే.
సహాయక చర్యల్లో ఎన్టీఆర్ఎఫ్తో పాటు త్రివిధ దళాలు సైతం అందించిన సేవలు ఓ నిండు గర్భిణి ప్రాణాలను కాపాడాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన నెలలు నిండిని గర్భిణిని వైమానిక దళ హెలికాప్టర్లో ఆసుపత్రిలో తరలించారు. ఆ గర్భిణికి ఇప్పుడు ఇద్దరు కవలలు జన్మించారు. ఇద్దరూ కూడా ఆడపిల్లలు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే, ఆమె పేరు దీప్తి(28). చెన్నైలోని రామాపురం ప్రాంతంలో నివాసం ఉంటోంది. తొమ్మిది నెలల గర్భిణీ. మరో వారం రోజుల్లోనో అంతకంటే ముందుగానో తల్లిగా మారబోతున్నాని ఆనందం.. ఇంతలో భారీ వర్షాలు. వరదలు, చెన్నై నగరం మొత్తం జలమయమైంది.
దీంతో తల్లి కాబోతున్న ఆనందం కంటే ఆమె మనసులో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ఎఫ్, త్రివిధ దళాలు చెన్నైలో పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సమాచారం ఇవ్వడంతో హెలికాప్టర్ సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఇంటిపై భాగం నుంచే ఆమెను సురక్షితంగా హెలికాప్టర్లో తాంబరం ఎయిర్ బేస్కు తరలించారు. అనంతరం అక్కడ నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన డిసెంబర్ 2వ తారీఖున చోటు చేసుకుంది.
ఈ సందర్బంగా ఆమె భర్త కార్తిక్ వెల్చామీ తాను పడిన ఆందోళన, భయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. చెన్నైకి సమీపంలోని వర్ష ప్రభావానికి గురైన గిండీకి సమీపంలోని రామపురం ప్రాంతం తమదని, నిండు గర్భవతి అయిన తన భార్యను ఏ విధంగా రక్షించుకోవాలా తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యానని తెలిపారు.
ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, డిసెంబర్ 2న ఆమెను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఆస్పత్రికి తరలించడంతో డిసెంబర్ 4న ప్రసవించిందని చెప్పాడు. ఈ విషయాన్ని చెబుతూ ఎంతో భావోద్వేగానికి లోనైన కార్తిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ధన్యవాదాలు తెలిపాడు.
తమను ఎవరూ కాపాడలేరనుకున్న సమయంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రక్షించిందని చెప్పారు. ఇది ఇలా ఉంటే చెన్నైలో మరికొంత మంది గర్భిణిలను కూడా హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు.