ఎన్సీపీ గుర్తు తమకే ఇమ్మని ఈసీని కోరిన అజిత్ పవార్-ఎవరినీ వదిలిపెట్టబోనన్న శరద్ పవార్..
మహారాష్ట్రలో ఎన్సీపీలో చోటు చేసుకున్న తిరుగుబాటు అనేక మలుపులు తిరుగుతోంది. బలం నిరూపించుకునేందుకు ఇవాళ ఎన్సీపీలో రెండు గ్రూపులు ఏర్పాటు చేసుకున్న వేర్వేరు భేటీలకు హాజరైన ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పేశారు. ఎన్సీపీ నుంచి ఫిరాయించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీలోని 53 ఎమ్మెల్యేల్లో 35 మంది హాజరయ్యారు. దీంతో భేటీ ముగిశాక అజిత్ ఈసీని కలిశారు.
తనకు పార్టీలో మెజారిటీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉందని, కాబట్టి ఎన్సీపీ గుర్తు తమకే కేటాయించాలని కోరుతూ అజిత్ పవార్ ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు 40 అఫిడవిట్లు కూడా సమర్పించారు. అలాగే తనకు ఉన్న మద్దతుపై ఇతర సమాచారాన్ని కూడా ఈసీకి ఇచ్చారు. ఇవన్నీ పరిశీలించి పార్టీ గుర్తు తమకే కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారిపోయింది.

మరోవైపు శరద్ పవార్ వర్గం ఇప్పటికే ఈసీ వద్ద కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈసీని కోరింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. తమ పార్టీ గుర్తును దొంగిలించాలని ప్రయత్నిస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గతంలో తాను ఎన్నో గుర్తులపై పోరాడానని, కానీ ఇప్పుడు తన మొహాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకుంటోందని పవార్ తెలిపారు. కానీ ఈ ఎత్తులేవీ వారికి పనికిరావని తేల్చేశారు.
మరోవైపు ఎన్సీపీ సంక్షోభంపై శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సైతం విచారణ జరగబోతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో స్పీకర్ శివసేన ఎమ్మెల్యేల అనర్హత అంశం తేల్చకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో తాము సమర్పించిన ఎమ్మెల్యేల అనర్హత జాబితాపై కూడా త్వరగా తేల్చాలని ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును కోరుతోంది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందన్నది శివసేనలో రెండు గ్రూపులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications