రాజ్యసభ సీటుకి రూ.100 కోట్లు: మాయావతి సంచలనం
లక్నో/న్యూఢిల్లీ: తమ పార్టీ మాజీ నేత, పార్లమెంటు సభ్యుడు అఖిలేష్ దాస్ రాజ్యసభ టిక్కెట్ కోసం రూ.100 కోట్ల వరకు ఇస్తామంటూ బేరం ఆడారని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి సంచలన ఆరోపణలు చేశారు.
బీఎస్పీ అభ్యర్థిగా గతంలో రాజ్యసభకు ఎన్నికైన అఖిలేష్ దాస్ పదవీకాలం ఈ నెలాఖరును ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరిగి తనకు మద్దతు ఇవ్వాలని దాస్ ఇటీవల తనను కలిసి యాభై కోట్ల రూపాయల నుండి వంద కోట్ల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మాయా అన్నారు.
ఆయన వంద కోట్ల రూపాయల వరకు ఇస్తామని చెబితే, తాను అంగీకరించలేదని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. రూ.200 కోట్లు ఇచ్చినా కూడా బీఎస్పీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని తాను ఆయనకు కుండబద్దలు కొట్టానని చెప్పారు. కాగా, అతను తన వర్గం కమ్యూనిటీనే మొబిలైజ్ చేయలేకపోయారని, అందుకే తాను దళితులకు టిక్కెట్ ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు కలసి తమ ఓటమికి కుట్ర పన్నాయని ఆమె అంతకుముందు ఆరోపించారు. కనీవినీ ఎరుగని రీతిలో మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అనైతిక కుట్రకు పాల్పడ్డాయని, ఆ కారణంగానే ఎన్నికల్లో తాము ఓటమి చవిచూశామన్నారు.
రాజకీయ పార్టీగానే కాక సామాజిక ఉద్యమానికి బాటలు వేసిన పార్టీగానూ బీఎస్పీ అవతరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన పార్టీగా బీఎస్పీ తన గురుతర బాధ్యతలను నెరవేరుస్తోందన్నారు.
మహారాష్ట్ర, హర్యానాలో భారతీయ జనతా పార్టీ తన సొంత సత్తాతో గెలవలేదని, కాంగ్రెస్ పైన ఆ రాష్ట్రాల్లో వ్యక్తమైన వ్యతిరేకతే వారి విజయానికి కారణంగా నిలిచిందన్నారు. కాగా, రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బరిలోకి దిగుతున్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే ఎత్తుగడల్లో భాగంగానే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications