"మా సీఎంకు పసలేదు, పనికిరాడు: మార్చేయండి"
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని తాము చూడలేదని, వెంటనే ఆయన గారికి ఉద్వాసన పలికి అనుభవజ్ఞుడైన, సమర్థవంతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యాలని సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి చెందిన ఓ ఎంఎల్సీ సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది అదే పార్టీకి చెందిన ఎంఎల్ సీ దేవేంద్ర ప్రతాప్ సింగ్. అఖిలేష్ యాదవ్ మీద ఆయన తండ్రి సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు ఈ విషయం సూచించడంతో ఆ పార్టీ నాయకులు హడలి పోయారు.
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతుందని, అయినా ఆయన గారికి ఓ గుర్తింపు రాలేదని, చాల స్కాంలు జరిగినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో అన్ని శాఖలలో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు.
అదే విధంగా యూపీపీఎస్ సీలో గత రెండేళ్లలో జరిగిన నియామకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నియామకాల మొత్తం మీద సీబీఐతో దర్యాప్తు చేయించాలని దేవంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా ఇదే సంవత్సరం జులై నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు.
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉంటే సమాజ్ వాది పార్టీ మనుగడే కష్టం అవుతుందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ఓ కోండలాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తగులుకున్నారని, ఆయన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.
ములాయం సింగ్ యాదవ్ కు వ్రాసిన ఓ లేఖలో దేవేంద్ర ప్రతాప్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు. అయితే ములాయం సింగ్ యాదవ్ ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. దేవేంద్ర ప్రతాప్ సింగ్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అంటూ ఆ పార్టీ లోని నాయకులు అందరూ వేచి చూస్తున్నారు.