బీజేపీ సీట్లను తగ్గించాం; ఎస్పీకి గతం కంటే సీట్లు, ఓట్లు పెరిగాయి: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్లో బిజెపి రికార్డు విజయం సాధించిన సంతోషంలో ఉంది. ఇక ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత, ప్రధాన ఛాలెంజర్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓటర్లు తమ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు . బిజెపి సీట్ల సంఖ్యను తగ్గించామని, ఈ ఎన్నికల ఫలితాలలో అదే తాము చూపించామని పేర్కొన్నారు. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.
బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించాం, ఈ క్షీణత కొనసాగుతుంది
ఈ ఉదయం ట్విట్టర్లో అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఓటర్లు తమ సీట్ల సంఖ్యను రెండున్నర రెట్లు పెంచారని, వారి ఓట్ల వాటాలో ఒకటిన్నర రెట్లు పెరిగిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించవచ్చని మేము చూపించామని పేర్కొన్న ఆయన బీజేపీ విషయంలో ఈ క్షీణత కొనసాగుతుందన్నారు . సమాజ్వాదీ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తుందని అని ఆయన తన మొదటి బహిరంగ ప్రతిస్పందనలో అన్నారు.
అఖిలేష్ యాదవ్ పార్టీకి 111 సీట్లు, గతం కంటే పెరిగిన సీట్లు
రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలోని 403 స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు మొత్తం 273 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో అధికారం మళ్ళీ బీజేపీ హస్తగతమైంది. ఇది 2017 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పుడు ఆ పార్టీ సాధించిన సీట్ల కంటే 49 సీట్లు తగ్గాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ సొంతంగా 111 సీట్లు గెలుచుకోగా, దాని నేతృత్వంలోని కూటమి 125 స్థానాల్లో విజయం సాధించింది. ఇది 2017 ఎన్నికలలో గెలుపొందిన 73 స్థానాల నుంచి 111కి చేరుకుంది.
బీఎస్పీ, కాంగ్రెస్ లతో పొత్తులు లేకుండా అఖిలేష్ పోటీ
ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ ఓటర్లను చేరుకోవడానికి మరియు వారి మద్దతును కోరడానికి ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించారు. 2017 ఎన్నికలలో లాగా కాంగ్రెస్తో లేదా 2019 ఎన్నికలలో వలె మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. రెండు పొత్తులు ఎన్నికలలో తక్కువ విజయాన్ని సాధించాయి. కానీ ఈ సారి వారితో పొత్తులతో కాకుండా ఎన్నికల రంగంలోకి వెళ్ళారు. బీజేపీని గద్దె దించాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
సమాజ్ వాదీ పార్టీకి 32 శాతం వోట్ షేర్
ఫలితాల వెల్లడి ప్రకారం, సమాజ్ వాదీ పార్టీ బిజెపి వ్యతిరేక ఓట్లలో పెద్ద భాగాన్ని ఏకీకృతం చేయగలిగింది. అయితే పెద్ద సంఖ్యలో సీట్లను మాత్రం చేజిక్కించుకోలేక పోయింది. ఇదిలా ఉంటే ఓట్ల శాతం విషయానికొస్తే, బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, సమాజ్వాదీ పార్టీ 32 శాతం ఓట్లను పొందగలిగింది. ఏది ఏమైనా 2017 ఎన్నికలతో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ బాగానే పుంజుకున్నట్టు కనిపిస్తుంది.