ఈ రెండు తేదీల్లోనూ బ్యాంకులు పనిచేస్తాయ్: ఉద్యోగుల సమ్మె నిర్ణయం విరమణ
తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె వాయిదా పడింది.
హైదరాబాద్: బ్యాంకులకు వరుసగా నాలుగైదు రోజులు సెలవుదినాలంటూ ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె వాయిదా పడింది. జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్బీయూ తాజాగా, శనివారం ప్రకటించింది. ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు యూనియన్లు ఈ సమ్మెను ప్రకటించాయి.

ఈ క్రమంలో వారి డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. దీంతో జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
అయితే, నాలుగో శనివారం కారణంగా జనవరి 28, 29 ఆదివారం రోజున బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఒకవేళ 30, 31 తేదీల్లో సమ్మె ఉండి ఉంటే వరుసగా బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు వచ్చేవి. కానీ, సమ్మె విరమణతో 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి.












Click it and Unblock the Notifications