'ఆడవాళ్లు ఆ పని మొదలుపెడితే..! మగాళ్ల సంగతి ఇక అంతే'
ముంబై : ఆడవాళ్లు కూడా పరువు హత్యలకు సిద్దపడితే.. చాలామంది మగవాళ్ల జీవితాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని పేర్కొన్నాడు బాలీవుడ్ నటుడు అలీ జాఫర్. సోదరుడి చేతిలో పరువు హత్యకు గురైన పాక్ వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యోదంతంపై ట్విట్టర్ లో స్పందించి జాఫర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
పరువు పేరుతో మహిళలు కూడా చంపడానికి సిద్దపడితే.. మనలో చాలామంది మగవాళ్లు చచ్చిపోవాల్సిందే అని చెప్పుకొచ్చాడు జాఫర్. అయితే పాక్ అంతటా పరిస్థితులు మరీ అంత దారుణంగా ఏం లేవంటూ అభిప్రాయపడ్డాడు జాఫర్.
ఇంకా అతను మాట్లాడుతూ.. నేనో ఆశావాదిని.. ఎప్పుడూ ఒకేలాగా ఉంటాను. నేను చాలా రొమాంటిక్ కూడా.. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండగడం కూడా నాకు తెలుసు . మీ అందరికీ తెలుసు.. పెషావర్ ఘటన తర్వాత రేపటి మీద ఆశను రేకెత్తిస్తూ నేనో పాట కూడా పాడాను..అంటూ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
అలాగే పాక్ సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించిన జాఫర్.. పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజురోజుకు వృద్ది చెందుతోందని పేర్కొన్నాడు. పాక్ లో మంచి ప్రతిభావంతులు కూడా ఉన్నారని, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ది చెందడం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశాడు జాఫర్.