అర్ధరాత్రి ఆ రిజర్వాయర్ గేట్లన్నీ ఎత్తివేత- ఉలికిపడ్డ సరిహద్దు రాష్ట్రం
నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రభావం ఇప్పుడు బీహార్ సరిహద్దుపై పడింది. పొరుగు దేశంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గండకీ నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. వరద నీటితో ఉప్పొంగుతోంది. బుధవారం రాత్రి సమయానికి గరిష్టస్థాయి నీటి మట్టాన్ని అందుకుందీ నది. ఇంకా భారీగా వరద నీరు వచ్చి చేరుతోండటంతో అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రి గేట్లన్నీ గండకీ బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తివేశారు.
నేపాల్ ముస్తాంగ్ రీజియన్ పరిధిలోని నుబైన్ హిమల్ గ్లేసియర్.. ఈ నదీ జన్మస్థానం. 185 కిలోమీటర్ల పొడవునా నేపాల్ లో ప్రవహిస్తుంది. బీహార్ సరిహద్దుల్లోని వాల్మీకీ నగర్ జిల్లాలో భారత్ లో ప్రవేశిస్తుంది గండకీ నది. పాట్నా శివార్లలోని హాజీపూర్ సోనేపూర్ వద్ద గంగ నదిలో కలిసిపోతుంది. ఈ నదికి అడ్డుగా వాల్మీకీ నగర్ వద్ద ఓ బ్యారేజీని నిర్మించారు. నేపాల్ లో సంభవించిన వరద తీవ్రత వల్ల ఇప్పుడీ గండకీ నది ఉప్పొంగుతోంది.

బుధవారం రాత్రి 8: 30 గంటల సమయంలో వరదనీటి ప్రవాహం ఈ బ్యారేజీకి చేరుకుంది. చూస్తూ చూస్తూనే నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. గంటల వ్యవధిలో 1,52,100 క్యూసెక్కులకు పెరిగిందీ నీటి ప్రవాహం. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో గండక్ బ్యారేజీకి ఉన్న మొత్తం 36 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దాదాపు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
ఇన్ ఫ్లో గరిష్టంగా రెండు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని బీహార్ జల వనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. నదీ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలవారికి హెచ్చరికలు జారీ చేశారు. తీరం వైపు వెళ్లొద్దంటూ సూచించారు. ఈ రిజర్వాయర్ నీటి మట్టం 354.80 అడుగులు కాగా..ప్రస్తుతం 352.30 అడుగులకు వరద నీరు చేరుకుంది.
ఈ వరద ఉధృతి నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి వంటి జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థానిక యంత్రాంగం నిరంతరం మైకుల ద్వారా వీదుల్లో ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు.
గండక్ తో పాటు నేపాల్లోని దేవ్ఘాట్ గేజ్ స్టేషన్ వద్ద ప్రవహించే నారాయణి నది నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 5.77 మీటర్లుగా ఉంది. ఇది తొమ్మిది మీటర్లకు చేరుకుంటే ప్రమాదకర స్థాయిగా పరిణిస్తారు. 7.30 మీటర్లకు చేరుకుంటే మొదటి హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నారాయణి.. గండకీకి ఉపనది కావడం వల్ల దీని ప్రవాహం కూడా తోడయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications