ఏ బటన్ నొక్కినా బిజెపికి కే ఓటు: కాంగ్రెస్, 2 గంటలు నిలిచిన పోలింగ్
బెంగుళూరు: కర్ణాటక ఎన్నికల్లో బిజెపి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్రంలోని జయనగర, ఆర్ ఆర్ నగహ మినహా 222 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్నాయి.అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని బనహట్టిలోని పోలింగ్ కేంద్రంలోత ఈవీఎంలో సాంకేతిక సమస్య కారణంగా ఏ బటన్ నొక్కినా కమలం గుర్తుకే ఓటు పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత కలప్పా ట్వీట్లు చేశారు. బనహట్టిలో ఈవీఎంల సమస్య కారణంగా రెండు గంటల పాటు పోలింగ్ ను నిలిపివేశారు.
బెంగళూరులోని ఆర్ఎంవీ 2 స్టేజ్. మా అమ్మానాన్నలుండే అపార్ట్మెంట్ ముందు ఐదు పోలింగ్ బూత్లున్నాయి. అందులోని రెండో బూత్లో మాత్రం ఓటేసేందుకు ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని కలప్పా ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకుని ఆగ్రహించిన ఓటర్లు ఓటేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.
తమకు ఈవీఎంలపై మూడు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని మరో ట్వీట్ చేశారు. రాంనగర, చమరాజ్పేట్, హెబ్బల్ లలో పలుచోట్ల ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమకు ఫిర్యాదు అందాయన్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని బ్రిజేష్ కలప్పా చెప్పారు.