5 కేబినెట్ మంత్రి పదవులతో బీజేపీ-శివసేన మధ్య కుదిరిన రాజీ..?
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి వర్గంలో చేరేందుకు సంబంధించిన అంశంపై చిరకాల మిత్రులు శివసేన-బీజేపీల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. మాహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలు దాటిన నేపథ్యంలో రెండు పార్టీలు సోమవారం భేటీ అయ్యాయి.
ఈ భేటీ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు శివసేన అంగీకరించినట్లు సమాచారం. శివసేనకు ఐదు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసింది.
వీటితోపాటు ఏడు సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మూడు భాగాల్లో ఒక భాగం శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. 25 ఏళ్ల మైత్రి బంధాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో పొత్తు కుదరక తెంచుకున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా శివసేన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, హోం శాఖ పదవి తమకు కావాలని పట్టుబడుతుండటంతో బీజేపీ మాత్రం హోం శాఖ పదవిని ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
బీజేపీ ప్రభుత్వం ఇవ్వనున్న క్యాబినెట్ మంత్రి పదవుల్లో నీటిపారుదల, వ్యవసాయం, ప్రజా పనుల తదితర శాఖలు ఉన్నాయి. సోమవారం జరిగిన ఈ భేటీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. ఈ భేటీకి శివసేన నుంచి సుభాష్ దేశాయ్, అనిల్ దేశాయ్ హాజరయ్యారు.